న్యూఢిల్లీ: ఢిల్లీ పరిసరాల్లో వాయు నాణ్యత క్షీణిస్తోందని, ప్రజలు ఇంట్లో కూడా మాస్క్లు ధరిస్తున్నారని చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. దేశ రాజధాని ఢిల్లీలో ఉన్న వాయు కాలుష్యంపై దాఖలైన పిటిషన్ విచారణ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో చూస్తున్నారు కదా, మేం మా ఇండ్లల్లో కూడా మాస్క్లు ధరిస్తున్నామని ఆయన అన్నారు. క్షీణిస్తున్న వాయు నాణ్యతతో పరిస్థితి ఆందోళనకరంగా మారినట్లు చీఫ్ జస్టిస్ అన్నారు. జడ్జిలు కూడా తమ ఇండ్లల్లో మాస్క్లు ధరిస్తున్నారన్నారు.
సీజే ఎన్వీ రమణ, జస్టిస్ డీవై చంద్రచూడ్, సూర్యకాంత్లతో కూడిన ప్రత్యేక ధర్మాసనం పిటిషన్ విచారణ చేపట్టింది. ఢిల్లీ, హర్యానా, పంజాబ్, పశ్చిమ యూపీలో రైతులు పంటల్ని కాలుస్తున్న ఘటనలను అదుపు చేసేందుకు ఢిల్లీ, కేంద్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని ధర్మాసనం సూచించింది. రైతులకు హ్యాపీ సీడర్ మెషీన్లు సప్లయ్ చేయాలని కోర్టు చెప్పింది.
లక్షల సంఖ్యలో హ్యాపీ సీడర్ మెషిన్లు ఉన్నట్లు మీరు చెబుతున్నారు, కానీ రైతులు ఆ మెషీన్లను ఖరీదు చేయలేరని, పంట వ్యర్ధాలను కాల్చకుండా.. ఆ దాణాను మేకలకు వేసేలా చర్యలు చేపట్టాలని జస్టిస్ సూర్యకాంత్ తెలిపారు. రెండు లక్షల సీడర్ మెషీన్లు 80 శాతం సబ్సిడీ రేటుకు అందుబాటులో ఉన్నాయని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టుకు తెలిపారు. తాను రైతునే అని, సీజేఐ కుటుంబం కూడా రైతు ఫ్యామిలీ అని, ఆ మెషీన్ల కచ్చితమైన ధర ఎంతో చెబుతారా అని సూర్య కాంత్ ప్రశ్నించారు. దానికి బదులిస్తూ.. సహకార సంఘాలు ఆ మెషీన్లను ఉచితంగా ఇస్తున్నట్లు తుషార్ మెహతా చెప్పారు.
ఏక్యూఐని 500 నుంచి 200కు ఎలా తగ్గిస్తాం, ఏవైనా అత్యవసర నిర్ణయాలు తీసుకోండి, రెండు రోజుల పాటు లాక్డౌన్ అమలు చేస్తారా.. ఇంకేదైనా ప్లాన్ ఉందా.. ప్రజల ఎలా బ్రతుకుతారని సీజే రమణ కేంద్రాన్ని ప్రశ్నించారు. ఇలాంటి వాతావరణంలో చిన్న పిల్లలను స్కూల్కు పంపుతున్నాం, వాయు కాలుష్యానికి వాళ్లను ఎక్స్పోజ్ చేస్తున్నామని ఎయిమ్స్ వైద్యులు చెప్పారని సీజే గుర్తు చేశారు. మరో రెండు మూడు రోజుల్లో ఢిల్లీలో వాయు కాలుష్యం మరింత ప్రమాదకరంగా మారుతుందని, ఈ లోగా ఏదైనా అర్జెంట్ నిర్ణయం తీసుకోవాలని, లాంగ్ టర్మ్ పరిష్కారం గురించి తర్వాత ఆలోచిద్దామని కోర్టు తెలిపింది.