Army Chief General | భూటాన్, చైనాల మధ్య జరుగుతున్న సరిహద్దు చర్చలను నిశితంగా పరిశీలిస్తున్నామని ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్పాండే తెలిపారు. భూటాన్, చైనా మధ్య సరిహద్దు వివాదంలో డోక్లామ్ సైతం ఉన్నది. డోక్లామ్ ట్రై జంక్షన్లో భారత్, చైనా, భూటాన్ సరిహద్దులను పంచుకుంటాయి. 2017లో డోక్లామ్ విషయంలో భారత్-చైనా మధ్య వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. వాస్తవానికి డోక్లామ్ ప్రాంతాన్ని చికెన్ నెక్గా పిలుస్తుంటాయి. ఇది భారత్లోని ఈశాన్య ప్రాంతానికి సమీపంలో ఉంటుంది. దాంతో ఈ ప్రాంతం భారత్కు కీలకమైంది.
భారత్-మయన్మార్ సరిహద్దులో పరిస్థితి సైతం భారత్కు ఆందోళన కలిగిస్తున్నది. మయన్మార్లోని పలువురు మిజోరాం, మణిపూర్లోనూ ఆశ్రయం పొందుతున్నారు. భారత్-మయన్మార్ సరిహద్దుల్లో కొన్ని తిరుగుబాటు గ్రూపులు ఒత్తిడికి గురిచేస్తూ మణిపూర్ సరిహద్దుల్లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించడం ఆందోళన కలిగిస్తోంది. ఈ పరిస్థితిని సైన్యం పర్యవేక్షిస్తున్నది. అసోం రైఫిల్స్ను అప్రమత్తం చేయడంతో పాటు సరిహద్దుల్లో ఫెన్సింగ్ను పటిష్టం చేసే అంశాన్ని పరిశీలిస్తున్నది.
అయితే గతేడాది ఈశాన్య రాష్ట్రాల్లో పరిస్థితి మెరుగుపడిందని, ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలే ఇందుకు కారణమని జనరల్ మనోజ్ పాండే తెలిపారు. హింసాత్మక ఘటనలు తగ్గుముఖంపట్టాయన్నారు. గతేడాది మేలో మణిపూర్లో హింసాత్మక సంఘటనలు జరిగాయని.. రాష్ట్ర ప్రభుత్వం, సైన్యం, అసోం రైఫిల్స్ సంయుక్త ప్రయత్నాలతో ప్రస్తుతం పరిస్థితి స్థిరంగా ఉందన్నారు. పరిస్థితిని సాధారణ స్థితికి తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు.
దేశ ఆర్థిక ప్రగతి బాటలో పటిష్టంగా ముందుకు సాగుతోందని ఆర్మీ చీఫ్ పేర్కొన్నారు. జమ్మూ కశ్మీర్లో పరిస్థితిపై ఆర్మీ చీఫ్ స్పందిస్తూ.. కశ్మీర్లో ఎల్ఓసీలో కాల్పుల విరమణ కొనసాగుతుందని.. అయితే చొరబాటు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. ఆ ప్రయత్నాలను విఫలం చేస్తున్నట్లు తెలిపారు. డ్రోన్ల ద్వారా సరిహద్దు ఆవల నుంచి ఆయుధాలు, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా జరగకుండా పటిష్టమైన యాంటీ డ్రోన్ వ్యవస్థను రూపొందించినట్లు తెలిపారు. రాజౌరి, పూంచ్ ప్రాంతాల్లో తీవ్రవాద కార్యకలాపాలు పెరిగాయన్నారు.