లక్నో: లఖింపూర్ ఖేరీ ఘటనపై ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్వాది పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ మరోసారి స్పందించారు. వాళ్ల వాహనాలతో రైతులను తొక్కించారని, దాంతో కొందరు రైతులు ప్రాణాలు కోల్పోయారని, అయినా అతను ఇంకా పదవిలో కొనసాగుతున్నారని కేంద్రమంత్రి అజయ్ మిశ్రాను ఉద్దేశించి అఖిలేష్ యాదవ్ వ్యాఖ్యానించారు. కేంద్ర హోంశాఖ సహాయమంత్రిగా ఉన్న వ్యక్తి ఇంట్లోని నిందితుడిని అరెస్ట్ చేయడానికి పోలీసులు ఎలా వెళ్లగలరని ఆయన ప్రశ్నించారు.
కేంద్రమంత్రి తన పదవికి రాజీనామా చేసి తీరాల్సిందేనని, ఈ కేసులో ప్రధాన నిందితుడు అరెస్ట్ కావాల్సిందేనని అఖిలేష్ యాదవ్ పేర్కొన్నారు. పరిస్థితిని బట్టి చూస్తుంటే బీజేపీ సర్కారు బాధితుల న్యాయం చేసేలా కనిపంచడం లేదన్నారు. రైతులు ఈ ప్రభుత్వ అధికారాన్ని ఊడగొట్టాలని పిలుపునిచ్చారు. ఘటనకు సంబంధించిన వీడియోలను చూసినా, ప్రత్యక్ష సాక్షలు చెబుతున్న వివరాలు విన్నా మంత్రి కొడుకే రైతులపైకి వాహనాలు పోనిచ్చినట్లు తెలుస్తుందని అఖిలేష్ చెప్పారు.
అదేవిధంగా తమకు త్వరలోనే మరో రథయాత్ర నిర్వహించే అవకాశం రాబోతున్నదని, ఈసారి చేపట్టబోయే యాత్ర సమాజ్వాది పార్టీ విజయ యాత్రేనని అఖిలేష్ ధీమా వ్యక్తంచేశారు. రాష్ట్రంలో బీజేపీ పాలనపై ఉత్తరప్రదేశ్ ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని ఆయన చెప్పారు.