నిజామాబాద్ సిటీ, ఏప్రిల్ 18: మహారాష్ట్రలో కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతున్నది. వైరస్ వేగంగా వ్యాప్తి చెందడం, అక్కడ రాత్రిపూట కర్ఫ్యూ విధించడంతో వలస జీవులు స్వగ్రామాలకు బయల్దేరుతున్నారు. మన రాష్ట్రం నుంచి వెళ్లిన అనేక మంది కార్మికులు మహారాష్ట్రలోని ముంబై, పుణె, నాందెడ్ నగరాల్లో పనులు చేస్తున్నారు. నిజామాబాద్, కరీంనగర్, మహబూబ్నగర్, ఆదిలాబాద్ జిల్లాలకు చెందిన అనేక మంది ప్రస్తుతం తమ సొంత ఊళ్లకు తిరిగి వస్తున్నారు. ముంబైలో ఉన్న ఎక్కువ మంది ప్రైవేటు బస్సుల్లో ఇండ్లకు వస్తున్నారు. ఇదే అదునుగా భావించిన ప్రైవేటు ట్రావెల్స్ వారు వలస జీవులను దోచుకుంటున్నారు. ముంబై నుంచి నిజామాబాద్కు ఒక్కొక్కరికి ఏడు వందల రూపాయల బస్సు చార్జీ ఉండగా.. ప్రస్తుతం 15 వందల నుంచి రెండు వేల రూపాయల వరకు వసూలు చేస్తున్నారు. బస్సుల్లో కొవిడ్ నిబంధనలు సైతం పాటించడం లేదు. బస్సులు శుభ్రంగా ఉండడం లేదని, ప్రస్తుతం ఏమీ చేయలేని పరిస్థితుల్లో బస్సుల్లో రావాల్సి వస్తున్నదని కార్మికులు వాపోతున్నారు. ప్రైవేటు ట్రావెల్స్పై అధికారులు నిఘా పెట్టాలని, తమను స్వస్థలాలకు పంపే ఏర్పాట్లు చేయాలని కార్మికులు కోరుతున్నారు.