ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబైలో వాటర్ టాక్సీ సేవలు అందుబాటులోకి వచ్చాయి. దేశ వాణిజ్య నగరమైన ముంబై, నవీ ముంబై మధ్య వాటర్ టాక్సీ సర్వీసులను ఆ రాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే గురువారం ప్రారంభించారు. ఈ రెండు ప్రాంతాలను కలుపుతూ జలమార్గంలో రవాణా సదుపాయం ఏర్పాటు కావడం ఇదే తొలిసారి. దీంతో వీటి మధ్య దూరం, ప్రయాణ సమయం బాగా తగ్గుతాయి.
ముంబైలో వాటర్ టాక్సీ సేవల కోసం బేలాపూర్ జెట్టీ ప్రాజెక్ట్ను 2019 జనవరిలో ప్రారంభించారు. 2021 సెప్టెంబర్ నాటికి దీని నిర్మాణం పూర్తయ్యింది. సాగరమాల కార్యక్రమం కింద చేపట్టిన ఈ ప్రాజెక్ట్ కోసం రూ.8.37 కోట్లు ఖర్చు చేశారు. నెరుల్, బేలాపూర్, ఎలిఫెంటా దీవులను ఈ జలమార్గం కలుపుతుంది. వీటి మధ్య నడిచే వాటర్ టాక్సీ ఛార్జీలు, సంబంధిత నియమ నిబంధనలను కూడా అధికారులు వెల్లడించారు.