గ్యాంగ్టక్, అక్టోబర్ 2: సిక్కింలో వచ్చే ఏడాది జనవరి 1 నుంచి ‘ప్యాకేజ్డ్ మినరల్ వాటర్’ను నిషేధిస్తున్నట్టు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పీఎస్ తమాంగ్ ప్రకటించారు. ఈ నిషేధం అమలులోకి వచ్చాక ప్రజలు సహజ వనరులను వినియోగించుకోవాలని, ఇవి ప్లాస్టిక్ బాటిళ్లలో లభించే తాగునీటి కంటే చాలా ఆరోగ్యకరమైనవని చెప్పారు. గాంధీ జయంతి సందర్భంగా శనివారం జరిగిన కార్యక్రమంలో ఆయన ప్రభుత్వ నిర్ణయాన్ని వెల్లడించారు. హిమాలయ ప్రాంత రాష్ట్రమైన సిక్కింలో తాజా, నాణ్యమైన తాగునీటిని అందించే సహజ వనరులకు కొదవ లేదన్నారు.