పట్నా: జేడీయూ అగ్ర నేత నితీశ్కుమార్ నేతృత్వంలోని బీహార్ సర్కారుకు ఆ సంకీర్ణ సర్కారులోని మిత్రపక్షం ‘హిందుస్థానీ అవామీ మోర్చా (HAM)’ ఝలక్ ఇచ్చింది. ప్రభుత్వానికి తమ మద్దతు ఉపసంహరించుకుంటున్నట్లు ఆ పార్టీ అధ్యక్షుడు సంతోష్ సుమన్ ప్రకటించారు. ఇదే విషయమై గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్కు తాము లేఖను అందజేయబోతున్నామని ఆయన చెప్పారు. అందుకోసం ఇప్పటికే గవర్నర్ అప్పాయింట్మెంట్ కోరామన్నారు.
కాగా, గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమిలో భాగంగా బీజేపీ, జేడీయూతో కలిసి హెచ్ఏఎమ్ పోటీపడింది. మొత్తం ఏడు స్థానాల్లో పోటీ చేసి నాలుగు స్థానాల్లో గెలిచింది. ఆ తర్వాత నితీశ్ కుమార్ ఏన్డీఏ నుంచి వైదొలిగి ఆర్జేడీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు హెచ్ఏఎమ్ కూడా నితీశ్ వెంట వచ్చింది. నితీశ్ ప్రభుత్వంలో సంతోష్ సుమన్కు మంత్రి పదవి దక్కింది.
కానీ, ఇటీవల నితీశ్కుమార్కు సంతోష్ సుమన్కు విభేదాలు రావడంతో ఆయన మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఇప్పుడు ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించారు. సంతోష్ సుమన్ బీహార్ మాజీ ముఖ్యమంత్రి జితన్రామ్ మాంఝీ కుమారుడు. మాంఝీ 2015లో బీహార్ రాజకీయ సంక్షోభం సందర్భంగా HAM ను ఏర్పాటు చేశారు. ఆ తర్వాత కొడుకుకు పార్టీ బాధ్యతలు అప్పగించారు.