Protem Speaker : కేంద్రపాలిత ప్రాంతం జమ్ముకశ్మీర్లో సుదీర్ఘకాలం తర్వాత అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. అక్కడ చివరగా బీజేపీ-పీడీపీ సంకీర్ణ సర్కారు కుప్పకూలడం, జమ్ముకశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని కేంద్ర ప్రభుత్వం రద్దుచేసి జమ్ముకశ్మీర్, లఢఖ్ అనే రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించడం, కేంద్రం తీరును నిరసిస్తూ ఆందోళనలు వెల్లువెత్తడం లాంటి పరిణామాల నేపథ్యంలో 2018 నుంచి రాష్ట్రపతి పాలన కొనసాగింది.
ప్రస్తుతం పరిస్థితి చక్కబడటంతో ఇటీవల అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించారు. మొత్తం 90 స్థానాలకు గాను నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ 42 స్థానాలను గెలుచుకుంది. కాంగ్రెస్, ఆప్ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఒమర్ అబ్దుల్లా ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసి, బాధ్యతలు స్వీకరించారు. ఆయనతోపాటు కొందరు మంత్రులుగా బాధ్యతలు తీసుకున్నారు. త్వరలో అసెంబ్లీ కొలువుదీరనుంది. ఈ నేపథ్యంలో ఇవాళ ప్రొటెం స్పీకర్ ప్రమాణస్వీకారం జరిగింది.
నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ సీనియర్ నేత ముబారక్ గుల్ ప్రొటెం స్పీకర్గా ప్రమాణస్వీకారం చేశారు. శ్రీనగర్లోని రాజ్భవన్లో ఈ ప్రమాణస్వీకార కార్యక్రమం జరిగింది. జమ్ముకశ్మీర్ గవర్నర్ మనోజ్ సిన్హా.. ముబారక్ గుల్ చేత ప్రమాణస్వీకారం చేయించారు. కొత్తగా కొలువుదీరబోయే అసెంబ్లీలో ఎమ్మెల్యేలందరి చేత ఆయన ప్రమాణస్వీకారాలు చేయించనున్నారు. ఆ స్పీకర్, డిప్యూటీ స్పీకర్ల ఎన్నిక జరగనుంది. ఇదిలావుంటే ఒమర్ అబ్దుల్లా క్యాబినెట్ ఇటీవల సమావేశమై జమ్ముకశ్మీర్కు రాష్ట్రహోదా కల్పించాలని తీర్మానం చేసింది.
#WATCH | Srinagar: National Conference leader Mubarak Gul takes oath as the J&K Assembly Protem Speaker at Srinagar Raj Bhawan administered by LG Manoj Sinha pic.twitter.com/vzrhI4lhvB
— ANI (@ANI) October 19, 2024