అహ్మదాబాద్: దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాల్లో విస్తారంగా వానలు పడుతున్నాయి. అల్పపీడనాలు, వాయుగుండాలు, తుఫాన్ల ప్రభావంతో వివిధ రాష్ట్రాలను వర్షాలు ముంచెత్తుతున్నాయి. దాంతో నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. జలాశయాలు నిండు కుండల్లా మారాయి. ఈ నేపథ్యంలో వివిధ జలాశయాల నుంచి అధికారులు నీటిని కిందికి వదులుతున్నారు. తాజాగా గుజరాత్లోని ఉకాయ్ డ్యామ్కు భారీగా వరదనీరు వచ్చి చేరుతున్నది.
డ్యామ్ పరిసర ప్రాంతాలతోపాటు ఎగువన ఉన్న మహారాష్ట్రలో కూడా కుండపోత వర్షాలు కురుస్తుండటంతో తాపీ నదికి వరద ప్రవాహం పెరిగింది. ఈ క్రమంలో ఆ నదిపై ఉన్న ఉకాయ్ డ్యామ్ నుంచి 1.5 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేయడం కోసం గేట్లను ఎత్తేశారు. దాంతో తాపీ నది పరవళ్లు తొక్కుతూ దిగువకు పరుగులు తీస్తున్నది. తాపీ నది పరవళ్లను కింది వీడియోలో మీరు కూడా వీక్షించవచ్చు.