లక్నో: ఉత్తరప్రదేశ్ షియా వక్ఫ్ బోర్డు మాజీ ఛైర్మన్ వసీం రిజ్వీ సోమవారం హిందూ మతంలోకి మారారు. ఇందులో భాగంగా ఘజియాబాద్ దాస్నాదేవి ఆలయంలో ప్రతిష్టించిన శివలింగానికి ఆయన పాలాభిషేకం చేశారు. సోమవారం ఉదయం 10.30 గంటలకు దాస్నా దేవి ఆలయ ప్రధాన అర్చకుడు నర్సింహానంద సరస్వతి సమక్షంలో మత మార్పిడి కార్యక్రమం జరిగింది. యజ్ఞం తర్వాత రిజ్వీ ఇస్లాంను విడిచిపెట్టి హిందూమతంలోకి మారి వేద శ్లోకాలు పఠించినట్లు హిందుస్థాన్ టైమ్స్ సోదరి ప్రతిక లైవ్హిందుస్తాన్ పేర్కొంది. అనంతరం ఆయన త్యాగి సంఘంతో అనుబంధమయ్యాయరని, ఆయన కొత్త పేరు జితేంద్ర నారాయణ్ సింగ్ త్యాగి అని వెల్లడించింది.
ఈ కార్యక్రమం అనంతరం ఆయన మాట్లాడారు. సనాతన ధర్మాన్ని ప్రపంచంలోని స్వచ్ఛమైన మతంగా పేర్కొన్నారు. 1992లో బాబ్రీ మసీదు కూల్చివేసినందున తాను హిందూ మతంలోకి మారడానికి డిసెంబర్ 6 పవిత్ర దినాన్ని ఎంచుకున్నట్లు ఆయన తెలిపారు. ‘నేను ఈ రోజు నుండి హిందూ మతం కోసం పని చేస్తాను. ముస్లింల ఓట్లు ఏ పార్టీకి పడవు. హిందువులను ఓడించేందుకు మాత్రమే వారు ఓట్లు వేస్తారు’ అని ఆయన అన్నట్లు లైవ్హిందుస్తాన్ పేర్కొంది. కాగా, రిజ్వీ హిందూమతంలోకి మారిన విషయాన్ని మధ్యప్రదేశ్కు చెందిన మంత్రి డా. నరోత్తమ్ మిశ్రా సోషల్ మీడియా ద్వారా ధృవీకరించారు.