(స్పెషల్ టాస్క్ బ్యూరో)
హైదరాబాద్, జనవరి 12 (నమస్తే తెలంగాణ): దేశంలో వంటగ్యాస్ ధరలు మండుతుండటంపై మాతృమూర్తులు భగ్గుమన్నారు. వంటగ్యాస్పై ఇస్తున్న సబ్సిడీని క్రమంగా ఎత్తేసిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. ప్రధానమంత్రి ఉజ్వల యోజన(పీఎంయూవై) కింద కొంతమంది లబ్ధిదారులకే ఇస్తున్న రూ. 200 సబ్సిడీ కూడా ఏ మాత్రం సరిపోవట్లేదని వాపోతున్నారు. నిత్యావసర ధరలు ఆకాశాన్నంటడం, ఉపాధి లేమి, గ్యాస్ సబ్సిడీ ఎత్తివేత, కొవిడ్ సంక్షోభం వెరసి.. గ్యాస్ స్టవ్ వెలిగించిన చేతులతోనే, తిరిగి కట్టెలు ఏరుకొనే పరిస్థితి దాపురించిందని వాపోతున్నారు. ఈ మేరకు ‘వారియర్ మామ్స్’ సంస్థలోని మాతృమూర్తులు, గృహిణులు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు ఓ లేఖ రాశారు. వచ్చే బడ్జెట్ కేటాయింపుల్లో పీఎంయూవై కింద ఇస్తున్న రాయితీని పెంచడంతో పాటు సాధారణ ఎల్పీజీ వినియోగదారులకు కూడా రాయితీ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. గ్రామాల్లో ఎల్పీజీ వాడకాన్ని పోత్సహించాలంటే రాయితీ ఇవ్వాల్సిందేనని కేంద్ర పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పురికి 5 వేల పోస్ట్కార్డులను రాశారు.
పొగ కారణంగా శిశు మరణాలు
ఎల్పీజీ రేట్లను అంతకంతకూ పెంచడంతోపాటు రాయితీని ఎత్తేయడంతో గ్రామాలు, పట్టణ శివారుల్లోని పేదలు, మధ్య తరగతి ప్రజలు కట్టెల పొయ్యి మీదనే వంట చేయాల్సి వస్తున్నదని పలువురు మాతృమూర్తులు ఆవేదన చెందుతున్నారు. ఇరుకు ఇండ్లల్లో పొగ కారణంగా చిన్నారులు, వృద్ధుల్లో అస్తమా, ఊపిరితిత్తుల సమస్యలతో పాటు శిశు మరణాలు తలెత్తుతున్నాయని వాపోతున్నారు. ‘వారియర్ మామ్స్’ డిమాండ్కు పలువురు ఎంపీలు, మేధావులు సంఘీభావం ప్రకటించారు. ఈ జాబితాలో బీజేపీ నేతలు, మాజీ కేంద్ర మంత్రులు మేనకా గాంధీ, వరుణ్గాంధీ, ఎంపీలు శశి థరూర్, ఫరూఖ్ అబ్దుల్లా, సౌగతా రాయ్, చంద్ర పి చౌదరి, డి రవికుమార్, కే జయకుమార్, టీఎన్ ప్రతీపన్, మహువా మజీ, మహమ్మద్ బషీర్, వందనా చవాన్, మహాత్మాగాంధీ ముని మనుమడు తుషార్ గాంధీ తదితరులు ఉన్నారు.