పితోరాగఢ్(ఉత్తరాఖండ్): అది 1952 వేసవికాలం, అప్పుడు పారులి దేవికి 12ఏండ్లు. చిన్న వయసులోనే ఆమెకు పెళ్లి జరిగింది. ఆమె భర్త భారత సైన్యంలో సైనికుడు. పారులి భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. ఆప్పటికి వీరిద్దరికి వివాహమై రెండు నెలలే అయింది. ఆత్మహత్యకు గల కారణమేంటో ఆమెకు తెలియదు. ఏండ్లు గడిచిపోయాయి. కానీ, ఆ ఒంటరి మహిళకు పెన్షన్ మాత్రం అందలేదు. 82ఏండ్ల వయసులో ఆమెకు పెన్షన్ మంజూరైంది. దీనిపై ఆమె స్పందిస్తూ ఇది ఒక్క డబ్బు గురించి మాత్రమే కాదు. నేను కోల్పోయిన గుర్తింపు గురించి అంటూ ఆమె పేర్కొంది. పారులి భర్త గగన్ సింగ్ 1946లో ఆర్మీలో కుమావ్ రెజిమెంట్లో సైనికుడిగా చేరాడు.
ఏడేండ్ల పోరాటం తర్వాత ఆమెకు రూ .11,700 పెన్షన్ ఇటీవల మొదలైంది. 1977 జూలై నుంచి ఇప్పటి వరకు రావాల్సిన రూ.20లక్షల బకాయిలను కూడా త్వరలోనే పొందనుంది. 70 ఏండ్ల తర్వాత ఆమెను యుద్ధంలో మరణించిన సైనికుడి భార్యగా గుర్తించినందుకు సంతోషం వ్యక్తం చేసింది. అధికారిక గుర్తింపు లేకుండానే ఇన్నేండ్లు జీవించానని, ఇప్పుడు ఆనందంగా ఉందని పారులి పేర్కొంది.