Madhya Pradesh | భోపాల్: మధ్యప్రదేశ్ ఉద్యోగ నియామకాల్లో భారీ కుంభకోణం జరిగిందన్న అనుమానాలు బలపడుతున్నాయి. గ్రూప్-2, గ్రూప్-4(పట్వారీ) ఉద్యోగ పరీక్షల్లో పెద్ద ఎత్తున అక్రమాలు చోటుచేసుకున్నాయని చెప్పేందుకు ఆధారాలు లభ్యమయ్యాయి. మధ్యప్రదేశ్లో మరో ‘వ్యాపం’ తరహా కుంభకోణం జరిగిందని, అధికార బీజేపీకి చెందిన నేతలు..తమ వాళ్లను ఉద్యోగాలకు ఎంపిక చేశారని ఆరోపణలు వెలువడుతున్నాయి. పట్వారీ ఉద్యోగ పరీక్షలో టాప్-3 ర్యాంకు పొందిన అభ్యర్థి ఆన్సర్షీట్ సామాజిక మాధ్యమంలో వైరల్గా మారింది.
ఓ విలేకరికి ఇచ్చిన ఇంటర్వ్యూలో మూడో ర్యాంక్ పొందిన పూనం మాట్లాడుతూ, పట్వారీ పరీక్షలో 8సబ్జెక్టుల పేర్లను చెప్పలేకపోయింది. మధ్యప్రదేశ్ ఎంప్లాయిస్ సెలక్షన్ బోర్డ్ ఈ ఏడాది మార్చి15-ఏప్రిల్ 26 మధ్య రెండు దశల్లో గ్రూప్2, గ్రూప్4 పరీక్షలను నిర్వహించింది. ఫలితాల్ని జూన్ 30న విడుదల చేసింది. టాప్-10 ర్యాంకులు పొందిన అభ్యర్థుల్లో ఏడుగురు గ్వాలియర్లోని ఎన్ఆర్ఐ కాలేజీ పరీక్షా కేంద్రం నుంచి ఉండటం సంచలనం రేపింది. ఈ ఎగ్జామ్ సెంటర్ కాలేజీ బీజేపీ ఎమ్మెల్యేకు చెందినది కావటంతో ఈ అంశం వివాదాస్పదంగా మారింది. ఫలితాల్ని రద్దుచేసి..మళ్లీ ఉద్యోగ నియమాకాలు చేపట్టాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నవేళ..బ్రోకర్ల ద్వారా బీజేపీ నేతలకు పెద్ద మొత్తంలో డబ్బులు అందాయని విమర్శలు వెల్లువెత్తాయి. ఇదిలా ఉండగా, టాప్-3 ర్యాంకర్ పూనం ఓ విలేకరికి ఇచ్చిన ఇంటర్వ్యూ కుంభకోణంపై అనుమానాల్ని మరింత పెంచింది.
ఉద్యోగ నియామకాల్లో కుంభకోణం జరిగిందన్న వార్తలు తనను ఆందోళనకు గురిచేసిందని, ఒత్తిడికి గురయ్యాయని ఓ ఇంటర్వ్యూలో పూనం చెప్పుకొచ్చారు. పట్వారీ పరీక్షలో ఏ ఏ సబ్జెక్టుల నుంచి ప్రశ్నలు ఇచ్చారని విలేకరి అడగగా, సబ్జెక్టుల పేర్లు పూనం చెప్పలేకపోయింది. ‘సులభమైన ప్రశ్నలకు రాసిన సమాధానాలు తప్పుకాగా. కఠిన ప్రశ్నలకు కరెక్ట్గా ఎలా రాయగలిగారు?’ అని విలేకరి అడగగా, పూనం ఏమీ చెప్పలేకపోయింది.