Karnataka Elections | బెంగళూరు, ఏప్రిల్ 9: కర్ణాటక జనాభాలో వొక్కలిగలు దాదాపుగా 15 శాతం ఉంటారు. లింగాయత్ల( lingayat – 17 శాతం) తర్వాత వొక్కలిగల ( Vokkaliga ) సంఖ్యనే ఎక్కువ. దాదాపు 100 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీల అభ్యర్థుల గెలుపోటములను నిర్ణయించే శక్తి వీరికి ఉన్నది. దీంతో ఈ వొక్కలిగల్లో పెద్దగా ఆదరణ లేని బీజేపీ.. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో వారిని ప్రసన్నం చేసుకొనేందుకు ట్రిక్కులు చేస్తున్నది. ముస్లింల 4 శాతం రిజర్వేషన్లను రద్దు చేసి.. దానిలో 2 శాతం వొక్కలిగలకు కేటాయిస్తున్నట్టు ప్రకటించడం ఇందులో భాగమని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.
తన ఆకర్షణ ప్లాన్లో భాగంగా అంతకుముందు బెంగళూరు ఎయిర్పోర్టు సమీపంలో 108 అడుగుల ఎత్తైన నాడప్రభు కెంపెగౌడ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. జానపద సాహిత్యంలోని ఉరీ గౌడ, నంజే గౌడల(మైసూర్ రాజ్యంలో ఉరీ గౌడ, నంజే గౌడ అనే ఇద్దరు వొక్కలిక వీరులు ఉండేవారని ప్రజల విశ్వాసం) చరిత్ర ఆధారంగా సినిమా తీస్తానని సినీనిర్మాత కూడా అయిన కర్ణాటక మంత్రి మునిరత్న ఇటీవల ప్రకటించడం కూడా వొక్కలిగలను ఆకర్షించే ప్రయత్నంలో భాగమని విశ్లేషకులు చెబుతున్నారు.
మైసూర్ ప్రాంతంలో ప్రభావం
ప్రధానంగా వొక్కలిగలకు పాత మైసూర్ రీజియన్ జిల్లాల్లో గట్టి పట్టు ఉన్నది. జేడీఎస్కు వొక్కలిగలు ప్రధాన ఓటుబ్యాంకుగా ఉన్నారు. రాష్ట్రంలోని 224 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఈ ఒక్క రీజియన్లో 58 స్థానాలు ఉన్నాయి. ప్రస్తుతం వీటిల్లో 24 నియోజకవర్గాల్లో జేడీఎస్ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కాంగ్రెస్ నుంచి 18, బీజేపీ నుంచి 15 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. 28 నియోజకవర్గాలతో కూడిన బెంగళూరు అర్బన్ జిల్లా, బెంగళూరు రూరల్ జిల్లా(4 స్థానాలు), చిక్బల్లాపూర్(8 స్థానాలు)ల్లో కూడా వొక్కలిగలు గణనీయ సంఖ్యలో ఉన్నారు.
17 మంది సీఎంలలో ఏడుగురు!
దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కర్ణాటకకు ఇప్పటి వరకు 17 మంది ముఖ్యమంత్రులు పనిచేయగా.. వీరిలో ఏడుగురు వొక్కలిక వర్గానికి చెందిన వారే కావడం గమనార్హం. ఇందులో కూడా రాష్ట్ర మొదటి ముగ్గురు ముఖ్యమంత్రులు కూడా వొక్కలిగ వారే. 1996-97 మధ్య కర్ణాటక నుంచి దేశ ప్రధానిగా పనిచేసిన మొట్టమొదటి వ్యక్తి హెచ్డీ దేవెగౌడ కూడా వొక్కలిగ కమ్యూనిటీకి చెందిన వ్యక్తే.
10 రోజుల్లో రూ.100 కోట్లు పట్టివేత
కర్ణాటకలో ఈసీ అధికారులకు పెద్దమొత్తంలో నగదు, మద్యం సీసాలు, ఇతర విలువైన వస్తువులు పట్టుబడుతున్నాయి. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నాటి నుంచి 10 రోజుల్లో సీజ్ చేసిన మొత్తం దాదాపు రూ.100కోట్లకు చేరుకుందని ఆదివారం కర్ణాటక ముఖ్య ఎన్నికల అధికారి వెల్లడించారు. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ మార్చి 29న అమల్లోకి వచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా తనిఖీల్లో రూ.36.8 కోట్ల నగదు, రూ.15.46 కోట్ల విలువజేసే ఉచిత పంపిణీ వస్తువులు, రూ.30 కోట్ల విలువజేసే 5.2 లక్షల మద్యం సీసాలు, రూ.15 కోట్లు విలువజేసే బంగారం, ఆభరణాలు, రూ.2.5 కోట్లు విలువజేసే వెండి ఆభరణాలు సీజ్చేశామని అధికారులు తెలిపారు.