Shashikala Reentry | తమిళనాడు మాజీ సీఎం జయలలిత నెచ్చెలి వీకే శశికళ వార్తల్లోకి వచ్చారు. శనివారం ఉదయం మెరీనాబీచ్లోని మాజీ ముఖ్యమంత్రులు జయలలిత, ఎంజీ రామచంద్రన్, సీఎన్ అన్నాదురై సమాధులను సందర్శించి నివాళులర్పించారు. శనివారం అన్నాడీఎంకే స్థాపించి 50 ఏండ్లు పూర్తవుతాయి.
ఈ నేపథ్యంలో జయ, ఎంజీఆర్, అన్నాదురై స్మారక చిహ్నాలను సందర్శించి నివాళులర్పించడం ప్రాధాన్యం సంతరించుకున్నది. ప్రజా జీవితానికి దూరంగా ఉంటానని గత మార్చిలో స్వయంగా శశికళ ప్రకటించిన సంగతి తెలిసిందే.
తన కార్యక్రమాలకు ఎటువంటి ప్రాధాన్యం లేదని శశికళ అధికారికంగా ప్రకటిస్తున్నా.. రాజకీయ విశ్లేషకులు మాత్రం ఆమె తిరిగి రాజకీయ రంగ ప్రవేశం చేయబోతున్నారని అంచనా వేస్తున్నారు. ఈ ఏడాది జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత జయలలిత, ఎంజీఆర్, అన్నాదురై స్మారకాలను సందర్శించడం ఇదే తొలిసారి.
తమిళనాడు అసెంబ్లీ, స్థానికసంస్థల ఎన్నికల్లో అన్నాడీఎంకే ఓటమి పాలైన తర్వాత ఆమె ఈ స్మారక కేంద్రాలను సందర్శించడం గమనార్హం. కానీ, శశికళకు తమ పార్టీలో చోటు లేదని అన్నా డీఎంకే సీనియర్ నేత జయకుమార్ తేల్చి చెప్పారు.