VK Paul | ఎన్నికలు జరగబోయే ఐదు రాష్ట్రాల్లో ఉన్న కోవిడ్ పరిస్థితులను కేంద్ర ప్రభుత్వం గురువారం కేంద్ర ఎన్నికల సంఘానికి వివరించింది. కరోనా కేసులు, వ్యాక్సినేషన్ తీరు, ఒమిక్రాన్ తదితర అంశాలను ఈసీకి వివరించింది. పెద్ద పెద్ద ర్యాలీలు, రోడ్డుషోలకు ఇది ఎంత మాత్రమూ సమయం కాదని, ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించరాదని నీతి ఆయోగ్ సభ్యుడు, కోవిడ్ టాస్క్ఫోర్స్ చీఫ్ వీకే పాల్ తేల్చి చెప్పారు. రాజకీయ ర్యాలీలు, సభలకు దూరంగా ఉంటేనే బాగుంటుందని ఆయన ఈసీకి సూచించారు. అయితే వీటన్నింటినీ ఆయా పార్టీలు తమంతట తాము ముందుకు వచ్చి, నిర్వహించకుంటేనే బాగుంటుందన్న అభిప్రాయంలో ఈసీ ఉన్నట్లు సమాచారం.
మరో వైపు కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ కూడా ప్రస్తుత పరిస్థితులు, కోవిడ్ కేసులపై ఈసీకి ఓ రిపోర్టు సమర్పించారు. ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ.. అక్కడి పరిస్థితులను తమకు విన్నవించాలని ఈసీ కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించిన విషయం విదితమే. కరోనా పరిస్థితులపై కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ ఈసీతో భేటీ కావడం ఇది రెండో సారి. గత సంవత్సరం డిసెంబర్ 27న కూడా ఓసారి ఆయన ఈసీతో భేటీ అయిన విషయం విదితమే. ఐదు రాష్ట్రాల్లో కోవిడ్ తీవ్రత, కోవిడ్ కేసులు, వ్యాక్సినేషన్ జరుగుతున్న తీరు తెన్నులను ఆయన ఈసీకి వివరించారు.