న్యూఢిల్లీ: ఢిల్లీ విమానాశ్రయం(Delhi Airport)లో పెను ప్రమాదం తృటిలో తప్పింది. రెండు విమానాలకు ఒకేసారి టేకాఫ్, ల్యాండింగ్కు అనుమతి ఇచ్చారు. అయితే చివరి క్షణాల్లో టేకాఫ్ను రద్దు చేశారు. ఏటీసీ ఇచ్చిన ఆదేశాలతో టేకాఫ్ను నిలిపివేశారు. దీంతో పెద్ద ప్రమాదమే తప్పినట్లు అధికారులు చెబుతున్నారు. విస్తారా ఎయిర్లైన్స్ సంస్థకు చెందిన ఆ రెండు విమానాల్లో ఒకటి టేకాఫ్ తీసుకోనుండగా, మరొకటి ల్యాండింగ్కు సిద్దమైంది.
ఢిల్లీ నుంచి బెంగాల్లోని బగ్దోరాకు వెళ్తున్న ఫ్లయిట్ యూకే725 టేకాఫ్ తీసుకోనుండగా, అహ్మాదాబాద్ నుంచి ఢిల్లీ వస్తున్న విమానం ల్యాండింగ్ కానున్నది. అయితే ఒకేసారి రెండింటికి సిగ్నల్స్ ఇవ్వడంతో.. రన్వేపై ఆ రెండు విమానాలు ఢీకొనే పరిస్థితి ఏర్పడింది. కానీ ఏటీసీ చాకచక్యంగా వ్యవహరించడంతో ఆ ప్రమాదం తప్పింది. అబార్ట్ సంకేతాలు ఇవ్వడంతో బగ్దోరా విమానం.. రన్వే నుంచి పార్కింగ్ బేకు వెళ్లిపోయింది. ఈ ఘటనపై ఇప్పటి వరకు విస్తారా ఎయిర్లైన్స్ సంస్థ ఎటువంటి ప్రకటన చేయలేదు.
టేకాఫ్, ల్యాండింగ్ చేస్తున్న రెండు విమానాల మధ్య దాదాపు 1800 మీటర్ల దూరం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదం తప్పడం వల్ల సుమారు మూడు వందల ప్రయాణికులు సురక్షితంగా ఉన్నారు. ఆ రెండు విమానాల్లో 300 ప్రయాణికులు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు.అహ్మాదాబాద్ నుంచి వస్తున్న విమానంలో ఉన్న 45 ఏళ్ల మహిళా పైలెట్ సోను గిల్ ఈ ప్రమాదాన్ని తప్పించినట్లు చెబుతున్నారు. ఆమె ఏటీసీకి సంకేతాలు ఇవ్వడం వల్ల .. ఆ వెంటనే టేకాఫ్ తీసుకుంటున్న విమానాన్ని ఏటీసీ నిలిపివేసినట్లు తెలుస్తోంది. రన్వేపై గందరగోళ పరిస్థితికి కారణమైన ఏటీసీ అధికారులపై డీజీసీఏ చర్యలు తీసుకున్నది.