కథువా, ఏప్రిల్ 14: కూర్చోడానికి బెంచీలు లేవు.. సరైన మరుగుదొడ్లు లేవు.. ఇతర సౌకర్యాలూ అంతంత మాత్రమే. ఇదంతా గత ఐదేండ్ల నుంచి చూస్తూ విసిగి వేసారిన ఒక చిన్నారి మోదీ సార్.. ఇదేం స్కూల్? ఒకసారి చూడండి.. కనీసం మీరైనా దీనిని బాగు చేయించండి అంటూ పెట్టిన వీడియో వైరల్గా మారింది. జమ్ముకశ్మీర్లోని కథువాలోని స్థానిక ప్రభుత్వ పాఠశాలలో చదివే సీరత్ నాజ్ అనే బాలిక తన స్కూల్ దుస్థితిని వీడియో తీసి ప్రధానికి పంపింది. తమకొక మంచి స్కూల్ను నిర్మించాలంటూ అభ్యర్థించింది. స్కూల్లో బెంచీలు, టాయిలెట్లు లేవని పేర్కొన్న ఆమె.. సగం మాత్రమే పూర్తయిన స్కూల్ బిల్డింగ్ను, దుమ్ముతో నిండిన స్కూల్ పరిసరాలు, మట్టితో ఉన్న నేలను చూపింది. బెంచీలు లేక కిందే కూర్చోవాల్సి వస్తున్నదని, నేలంతా దుమ్ము, ధూళితో ఉండటం వల్ల యూనిఫాం మురికిగా మారుతున్నదని, అది చూసి తమ తల్లులు కొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది.