న్యూఢిల్లీ: అది దేశ రాజధాని ఢిల్లీలోని సీఆర్ పార్క్ ఏరియా. మెయిన్ రోడ్డుపై వాహనాల రాకపోకలు సాఫీగా సాగుతున్నాయి. ఇంతలో ఓ బాలెనో కారు మితిమీరిన వేగంతో దూసుకొచ్చి.. ముందు వెళ్తున్న స్విఫ్ట్ డిజైర్ క్యాబ్ను ఢీకొట్టింది. ఆ తర్వాత రోడ్డుపైన ఫల్టీలు కొడుతూ దూసుకెళ్లింది. సీసీ కెమెరాలో రికార్డయిన ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సినిమా స్టంట్ను తలపిస్తున్నాయి. కానీ కారులో ఉన్న వ్యక్తి మాత్రం స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. అటు క్యాబ్ డ్రైవర్కు కూడా ఎలాంటి గాయాలు కాలేదు.
సీఆర్ పార్క్ ఏరియాలోని ఎన్ఆర్ఐ కాంప్లెక్స్ సమీపంలో సోమవారం మధ్యాహ్నం ఈ ఘటన చోటుచేసుకుంది. కల్కాజీ ఏరియాకు చెందిన 17 ఏళ్ల ఇంటర్మీడియట్ విద్యార్థి వేగంగా కారు నడిపి ఈ ప్రమాదానికి కారణమయ్యాడు. కాగా, తాను ప్రమాదం నుంచి తృటిలో బయటపడ్డానని, వెనుక నుంచి వచ్చిన ఆ కారు నా క్యాబ్ను సైడ్లో ఢీకొట్టి అదుపు తప్పిందని, అదే వెనుక ఢీకొని ఉంటే ఘోరం జరిగేదని క్యాబ్ డ్రైవర్ గౌరవ్ చెప్పాడు.
కాగా, ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రమాదం అనంతరం ఫల్టీలు కొట్టిన కారు నుంచి మరో ముగ్గురు విద్యార్థులు కూడా బయటికి వచ్చినట్లు, తర్వాత వాళ్లు అక్కడి నుంచి జారుకున్నట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. ఈ ఘటనకు సంబంధించిన సీసీ ఫుటేజ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.