వడోదర: వీధి వ్యాపారి తనకు రెండు పానీపూరీలు తక్కువిచ్చాడని ఓ మహిళా ఏకంగా రోడ్డుపై బైఠాయించి నిరసనకు దిగడం సోషల్మీడియాలో వైరల్ అయింది. గుజరాత్లోని వడోదరలో ఈ ఘటన జరిగింది. వీధి వ్యాపారి రూ.20లకు ఆరు పానీపూరీలు ఇస్తానని చెప్పి నాలుగే ఇవ్వడంతో ఆమె రోడ్డుపై బైఠాయించారు. తనకు మిగతా రెండు పానీపూరీలు ఇచ్చే వరకు కదలనని భీష్మించారు. ఈ అసాధారణ ధర్నాను చూసి వాహనదారులు జాగ్రత్తగా ఆమె పక్క నుంచి వాహనాలు పోనిచ్చారు.
కొందరు రోడ్డు పక్కన గుంపుగా చేరి ధర్నాను చూడసాగారు. పోలీసులు వచ్చాక పరిస్థితి మరింత నాటకీయంగా మారింది. తనకు రూ.20కి ఆరు పానీపూరీలు ఇప్పించాలని ఆమె ఏడుస్తూ పోలీసులను డిమాండ్ చేశారు. ఆమె ధర్నా వల్ల కొన్ని గంటల పాటు ట్రాఫిక్కు అంతరాయం కలిగింది. చివరికి ఆమెను పోలీసులు అక్కడి నుంచి తరలించి ట్రాఫిక్ను క్లియర్ చేశారు. అయితే ఆమెకు మిగిలిన రెండు పూరీలు లభించాయో లేదో తెలియలేదు.