న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన హైస్పీడ్ ట్రైన్ వందే భారత్ ఎక్స్ప్రెస్పై ఇప్పటికే పలు విమర్శలు వచ్చాయి. పశువులను ఢీకొనడంతో రైలు ముందు భాగం ధ్వంసం కావడం, ఈ రైలుపై రాళ్లు విసరడం వంటి సంఘటనలు జరిగాయి. తాజాగా వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు కోచ్ల లోపల చెత్తకుప్పలా ఉన్న ఫొటోలు వెలుగులోకి వచ్చాయి. ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ (ఐఏఎస్) అధికారి అవనీష్ శరణ్ ఈ ఫొటోను ట్విట్టర్లో షేర్ చేశారు. ఖాళీ వాటర్ బాటిళ్లు, ప్లాస్టిక్ కవర్లు, ఉపయోగించిన ఆహార, పానీయాల ప్యాక్లు రైలు బోగీ లోపల చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. ఒక కార్మికుడు శుభ్రం చేస్తుండటం కూడా ఈ ఫొటోలో ఉంది. భారత రాజ్యంగ పీఠక ప్రారంభమయ్యే ‘ప్రజలమైన మేము’ అన్న శీర్షికతో ఈ ఫొటోను ఆయన పోస్ట్ చేశారు.
కాగా, ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. నెటిజన్లు కూడా ఘటుగా స్పందించారు. మన దేశ ప్రజలకు హక్కుల గురించి తెలుసు కానీ బాధ్యతల గురించి తెలియదని ఒకరు విమర్శించారు. పరిసరాల పరిశుభ్రతకు ప్రజలంతా ముందుకు రావాలని సూచించారు. మనమంతా మంచి సౌకర్యాలు, మౌలిక సదుపాయాల గురించి అడుగుతామని, అయితే వాటిని శుభ్రంగా ఉంచడంలో జాగ్రతలు పాటించబోమని మరొకరు పేర్కొన్నారు.
‘మన బాధ్యతను అర్థం చేసుకోకపోతే ఏదీ మారదు. దేశాన్ని ఎలా ఆరోగ్యంగా ఉంచుకోవాలో ప్రజలు అర్థం చేసుకోవాలి’ అని ఒకరు హితవుపలికారు. అయితే రైలు ఏదైనప్పటికీ పరిస్థితులు ఇలాగే ఉంటాయని మరొకరు వ్యాఖ్యానించారు. మనం సివిక్ సెన్స్ పెంపొందించుకోనంత వరకు అభివృద్ధి వల్ల ఉపయోగం ఉండదని ఒకరు అన్నారు. బాధ్యతాయుతమైన పౌరులుగా ఉండాలని సూచించారు. మరి కొందరు కూడా భిన్నంగా కామెంట్లు చేశారు.
“We The People.”
Pic: Vande Bharat Express pic.twitter.com/r1K6Yv0XIa
— Awanish Sharan (@AwanishSharan) January 28, 2023