ఇంఫాల్, అక్టోబర్ 12: హింసాత్మక వీడియోల వ్యాప్తిని అడ్డుకోవడానికి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మణిపూర్ ప్రభుత్వం నిర్ణయించింది. హింసాత్మక ఘటనలు, ఆస్తుల విధ్వంసానికి సంబంధించిన వీడియోలను షేర్ చేసేవారి పట్ల చట్ట ప్రకారం కేసులు నమోదు చేసి కఠినంగా వ్యవహరిస్తామని బుధవారం రాత్రి ఆదేశాలు జారీ చేసింది. ఇటీవల కుకీ భాష మాట్లాడే కొందరు వ్యక్తులు ఇద్దరు మైతీ యువకులను పాయింట్ బ్లాంక్ తుపాకీతో కాల్చి చంపి గోతిలో పాతిపెట్టే వీడియో వైరల్ అయిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకొంది. ఎవరి వద్ద అయినా హింసాత్మక చిత్రాలు, వీడియోలు ఉంటే వారు సమీపంలో ఎస్పీ కార్యాలయానికి వాటిని అందజేసి పోలీసులు తగిన చర్యలు తీసుకొనేందుకు సహకరించాలని ఆదేశించింది.