కాంగ్పోక్సి: మణిపూర్లో మళ్లీ హింస చెలరేగింది. కాంగ్పోక్సి జిల్లాలో తీవ్రవాదులుగా అనుమానిస్తున్న కొందరు వ్యక్తులు వాహనాలపై దాడి చేసిన ఘటనలో ముగ్గురు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. కోట్టిమ్, కోట్లెన్ గ్రామాల మధ్య ఈ ఘటన జరిగిందని అధికారులు తెలిపారు. థౌడా బాప్టిస్ట్ అసోసియేషన్ సభ్యులు(టీబీఏ) చురాచాంద్పూర్ నుంచి తిరిగి వస్తుండగా వారిపై దాడి జరిగింది. ఈ ఘటనపై విచారణ ప్రారంభించినట్లు అధికారులు చెప్పారు. మృతులను పుమ్తంగ్, పాస్టర్ పావ్గౌలెన్, పాస్టర్ కైగోలున్లుగా గుర్తించారు.
మృతులంతా బాప్టిస్ చర్చి నాయకులని, వారు కుకీ వర్గానికి చెందిన వారని కుకీ స్టూడెంట్ ఆర్గనైజేషన్(కేఎస్ఓ) సోషల్ మీడియాలో తెలిపింది. లామ్కాలో జరిగిన ఒక సదస్సుకు హాజరైన చర్చి నాయకులు తిరిగి కాంగ్ఫోక్సికి వస్తుండగా ఈ దాడి జరిగింది. సమాచారం అందిన వెంటనే సీనియర్ పోలీసు అధికారులు ఇతర బలగాలతో కలసి ఘటనా స్థలానికి చేరుకున్నారు. దాడిలో పాల్గొన్నవారిని పట్టుకునేందుకు కూంబింగ్ ఆపరేషన్ ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు.