న్యూఢిల్లీ: ఢిల్లీ కొత్త లెఫ్టినెంట్ గవర్నర్గా వినయ్ కుమార్ సక్సేనా నియమితులయ్యారు. రాష్ట్రపతి కార్యాలయం ఈ మేరకు సోమవారం ప్రకటించింది. వినయ్ కుమార్ సక్సేనాను నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీకి లెఫ్టినెంట్ గవర్నర్గా నియమించినట్లు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కార్యాలయం తెలిపింది. ప్రస్తుతం ఆయన ఖాదీ, గ్రామీణ పరిశ్రమల కమిషన్ చైర్మన్గా ఉన్నారు.
1958 మార్చి 23న జన్మించిన వినయ్ కుమార్ సక్సేనా, ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్ యూనివర్సిటీ పూర్వ విద్యార్థి. రాజస్థాన్లోని జేకే గ్రూప్లో అసిస్టెంట్ ఆఫీసర్గా కెరీర్ను ప్రారంభించారు. వైట్ సిమెంట్ ప్లాంట్లో వివిధ హోదాల్లో 11 సంవత్సరాలు పనిచేశారు. 1995లో గుజరాత్లోని పోర్ట్ ప్రాజెక్ట్కు జనరల్ మేనేజర్గా ఉన్నారు. ఆ సంస్థ సీఈవోగా ఎదిగారు. ఆ తర్వాత ధోలేర్ పోర్ట్ ప్రాజెక్ట్ డైరెక్టర్గా ఆయన పని చేశారు. 2015 అక్టోబర్లో ఖాదీ, గ్రామీణ పరిశ్రమల కమిషన్ చైర్మన్గా నియమితులయ్యారు. హనీ మిషన్, కుమ్హర్ సశక్తికరణ్ యోజన, తోలు కళాకారుల సాధికారత, ఖాదీ ప్రకృతి పెయింట్ వంటి అనేక వినూత్న పథకాలు, ఉత్పత్తులను ప్రవేశపెట్టారు.
కాగా, 2016 డిసెంబర్లో ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ ఆకస్మికంగా రాజీనామా చేశారు. దీంతో అనిల్ బైజల్ ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్గా నియమితులయ్యారు. అయితే ప్రభుత్వ వ్యవహారాల్లో లెఫ్టినెంట్ గవర్నర్ అతి జోక్యంపై సీఎం కేజ్రీవాల్ పలు మార్లు మండిపడ్డారు. ఢిల్లీ ప్రభుత్వం, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అధికార పరిధుల వివాదం సుప్రీంకోర్టు వరకు వెళ్లింది. 2018లో వారి అధికార పరిధులపై సర్వోన్నత కోర్టు స్పష్టమైన చారిత్రక తీర్పు ఇచ్చింది.
మరోవైపు, లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్ కూడా ఇటీవల వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ సోమవారం ఆమెదించారు. ఈ నేపథ్యంలో వినయ్ కుమార్ సక్సేనాను ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్గా నియమించారు.