చండీగఢ్, నవంబర్ 19: హర్యానా రాష్ట్రంలో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకొన్నది. ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థికి రోహతక్ జిల్లాలోని చిరి గ్రామస్థులు భారీ బహుమతులు అందజేశారు. నవంబర్ 12న జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో ధర్మపాల్ అలియాస్ కాలా 66 ఓట్ల తేడాతో నవీన్ దలాల్ అనే అభ్యర్థి చేతిలో ఓటమిపాలయ్యాడు. అయితే, అతడు నిరాశలో కూరుకుపోకుండా ఊరు ఊరంతా మద్దతుగా నిలిచింది. అతడిని సంతోషపెట్టేందుకు ఊరంతా కలిసి ఎస్యూవీ కారు, రూ. 2.11 కోట్ల నగదును అందజేసింది. దీంతో ధర్మపాల్ ఓటమి బాధను మరిచిపోయి ఆనందంలో మునిగితేలాడు.