దిస్పూర్ : టోక్యో ఒలింపిక్స్లో భారత బాక్సర్ లవ్లీనా చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. 64-69 కేజీల విభాగంలో శుక్రవారం జరిగిన క్వార్టర్ఫైనల్లో లవ్లీనా అద్భుతమైన విజయం సాధించింది. ఈ నేపథ్యంలో లవ్లీనా స్వగ్రామమైన సారుపథార్ (అసోం) లో సంబురాలు మిన్నంటాయి. చైనీస్ తైపీకి చెందిన చెన్ విన్పై లవ్లీనా 4-1 తేడాతో విజయం సాధించడంతో గ్రామస్తులు స్వీట్లు పంచుకున్నారు. లవ్లీనా కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలుపుతూ ఆనందం వ్యక్తం చేశారు.
ఈ విజయంతో ఆమె సెమీఫైనల్లో అడుగుపెట్టింది. బాక్సింగ్ సెమీస్ ఫలితంతో సంబంధం లేకుండా ఇండియాకు మరో మెడల్ ఖాయం. సెమీస్లో ఒకవేళ లవ్లీనా ఓడినా.. బ్రాంజ్ మెడల్ మాత్రం ఖాయం.
లవ్లీనా మూడు రౌండ్లలోనూ పూర్తి ఆధిపత్యం చెలాయించింది. తొలి రౌండ్లో 3:2 తో ఆధిక్యంలో ఉండగా.. రెండో రౌండ్లో మొత్తం ఐదుగురు జడ్జీలు లవ్లీనాకే 10 స్కోరు ఇచ్చారు. ఇక మూడో రౌండ్లో నలుగురు లవ్లీనా వైపే మొగ్గారు. దీంతో ఆమె 4-1తో గెలిచి సెమీస్లో అడుగుపెట్టింది.