హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 8 (నమస్తే తెలంగాణ): శాస్త్ర, సాంకేతిక రంగాల్లో తెలంగాణ ఖ్యాతి దిగంతాలకు వ్యాపించనున్నది. దేశంలోనే తొలి ప్రైవేట్ రాకెట్ ‘విక్రమ్-ఎస్’ను ప్రయోగించేందుకు హైదరాబాద్ స్టార్టప్ కంపెనీ ‘స్కైరూట్ ఏరోస్పేస్’ సిద్ధమైంది. ఈరాకెట్ ద్వారా మూడు కస్టమర్ పేలోడ్లను నింగిలోకి పంపనున్నారు. ఈనెల 12-16 మధ్యన ఈ ప్రయోగాన్ని నిర్వహించనున్నట్టు స్కైరూట్ మంగళవారం ప్రకటించింది.
ఈ సంస్థకు ఇదే తొలి ప్రయోగం. దీనికి ‘ప్రారంభ్’ అని నామకరణం చేశారు. శ్రీహరికోటలోని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) లాంచ్ప్యాడ్ నుంచి ఈ రాకెట్ను ప్రయోగించేందుకు అధికారులు ఈ నెల 12-16 మధ్యన లాంచ్ విండోను నోటిఫై చేశారని, వాతావరణ పరిస్థితులనుబట్టి తుది ప్రయో గ తేదీ ఖరారవుతుందని స్కైరూట్ ఏరోస్పేస్ సీఈవో, ఆ సంస్థ సహ వ్యవస్థాపకుడు పవన్కుమార్ చందన వివరించారు.
ఇటీవల బెంగళూరులో ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్, ఇతర అధికారులతో సమావేశమై ఈప్రయోగానికి సంబంధించిన ఏర్పాట్ల గురించి చర్చించినట్టు తెలిపారు. విక్రమ్-ఎస్ రాకెట్ను చాలా తక్కువ కాలంలోనే తయారుచేసి ప్రయోగానికి సిద్ధం చేయగలిగామని, ఇస్రోతోపాటు ఇన్-స్పేస్ (ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్) నుంచి తమకు అమూల్యమైన తోడ్పాటు అందడం వల్లే ఇది సాధ్యమైందని పేర్కొన్నారు.
విక్రమ్-ఎస్ ప్రయోగంతో దేశంలోనే తొలిసారి నింగిలోకి రాకెట్ను పంపిన ప్రైవేట్ కంపెనీగా ‘స్కైరూట్ ఏరోస్పేస్’ చరిత్ర సృష్టించనున్నది. సింగిల్ స్టేజ్ సబ్-ఆర్బిటాల్ వాహకనౌక అయిన ‘విక్రమ్-ఎస్’ రాకెట్ ద్వారా 3 కస్టమర్ పేలోడ్లను నింగిలోకి పంపనున్నారు. విక్ర మ్ సిరీస్ రాకెట్లకు సంబంధించిన పలు సాంకేతికతలను పరీక్షించి, వాటి సామర్థ్యాన్ని అంచనా వేసేందుకు ఈ ప్రయోగం ఉపకరిస్తుందని స్కైరూట్ ఏరోస్పేస్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ నాగభరత్ డాకా పేర్కొన్నారు.
ఒప్పందం చేసుకొన్న తొలి స్టార్టప్ ఇదే
స్పేస్ సెక్టార్లో స్కైరూట్ నూతన ఆవిష్కరణలతో విజయవంతంగా దూసుకుపోతున్నది. వాణిజ్య ఉపగ్రహాలను నింగిలోకి పంపేందుకు అత్యాధునిక రాకెట్లను తయారు చేయడంలో నిమగ్నమైన ఈ కంపెనీ.. రాకెట్ల తయారీ ఖర్చును తగ్గించడం ద్వారా ఉపగ్రహ ప్రయోగాలను చౌకగా అందుబాటులోకి తేవాలని లక్ష్యంగా పెట్టుకొన్నది. గతంలో రెండుసార్లు జాతీయ స్థాయి అవార్డులను కైవసం చేసుకొన్న స్కైరూట్ ఇస్రోతో ఒప్పందం చేసుకున్న తొలి భారత స్టార్టప్ కంపెనీగా నిలిచింది.