పాట్నా : బిహార్ అసెంబ్లీ స్పీకర్ విజయ్ కుమార్ సిన్హా తన పదవికి రాజీనామా చేయనున్నట్లు బుధవారం ప్రకటించారు. ఎన్డీయే కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండగా.. జేడీయూ చీఫ్ నితీశ్కుమార్ బీజేపీతో తెగతెంపులు చేసుకొని ఆర్జేడీ, కాంగ్రెస్తో కలిసి మహాఘట్బంధన్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం అసెంబ్లీలో నితీశ్ సర్కారు బలాన్ని నిరూపించుకోవాల్సి ఉంది.
అయితే, ఇంతకు ముందు ప్రభుత్వంలో స్పీకర్గా బాధ్యతలు స్వీకరించిన విజయ్కుమార్ సిన్హాను సీఎం రాజీనామా చేయాలని కోరగా.. ఆయన నిరాకరించారు. దీంతో అధికార కూటమికి చెందిన సభ్యులు స్పీకర్పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ క్రమంలోనే ఆయన స్పీకర్ పదవి నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. అవిశ్వాస తీర్మానంపై ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. దాదాపు 20 నిమిషాల పాటు భావోద్వేగ ప్రసంగం చేశారు. ఆ తర్వాత రాజీనామా చేయాలని అనుకుంటున్నట్లు తెలిపారు.