అమృత్సర్: అక్రమాస్తుల కేసులో పంజాబ్ (Punjab) మాజీ ఉప ముఖ్యమంత్రిని విజిలెన్స్ బ్యూరో (Vigilance Bureau) అరెస్టు చేసింది. ఆదాయ వనరులకు మించి ఆస్తులు కూడబెట్టాడన్న (Accumulating Assets) ఆరోపణలపై మాజీ ఉపముఖ్యమంత్రి (Former Deputy CM) ఓపీ సోనీని (OP Soni) అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఆయన పదవిలో ఉన్న 2016 నుంచి 2022 వరకు ఆదాయానికి మించిన ఆస్తులను కూడబెట్టారనే ఆరోపణలు ఉన్నాయి. ఆయనను నేడు అమృత్సర్ (Amritsar) కోర్టులో హాజరుపర్చనున్నారు. రాష్ట్రంలో అవినీతికి వ్యతిరేకంగా తీసుకుంటున్న చర్యల్లో భాగంగా సీఎం భగవంత్ మాన్ (CM Bhagwant Mann) ఆదేశాల మేరకు విజిలెన్స్ బ్యూరో (VB) అధికారులు ఆయనను అరెస్టు చేశారు. అవినీతి నిరోధక చట్టంలోని 13(1), బి, 13(2) సెక్షన్ల కింద ఆయనపై కేసు నమోదుచేసినట్లు చెప్పారు.
గత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఓపీ సోని 2016 నుంచి 2022 వరకు ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. ఈ కాలంలో ఆయన కుటుంబ ఆదాయం రూ.4.52 కోట్లు. అయితే వారి ఖర్చు మాత్రం రూ.12.48 కోట్లు. అంటే సోనీ కుటుంబం ఆదాయానికి మించి 176.08 శాతం ఖర్చుచేసిందని వీబీ అధికారులు తేల్చారు. తన భార్య సుమన్ సోనీ (Suman Soni), కుమారుడు రాఘవ్ సోనీల (Raghav Soni) పేర్లపై అక్రమంగా ఆస్తులు కూడబెట్టారని విచారణలో తేల్చారు.
ఆయనపై 2022, అక్టోబర్ 10న ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారని వచ్చిన ఫిర్యాదు ఆధారంగా దర్యప్తుచేస్తున్నారు. సోనీ ఇప్పటికే విచారణలో భాగంగా అమృత్సర్లో వీబీ అధికారుల ముందు హాజరయ్యారు. ఈ సందర్భంగా తనకు స్థిర, చరాస్తులకు సంబంధించిన వివరాలను అధికారులకు సమర్పిస్తానని కూడా చెప్పారు. కాగా, అక్రమాస్తుల కేసులో కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే కుశాల్ దీప్ సింగ్ ధిల్లాన్ను (MLA Kushaldeep Singh Dhillon) కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.