లక్నో : ఉత్తరప్రదేశ్లో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం యోగి ఆదిత్యనాథ్పై పోటీ చేస్తానని మాజీ ఐపీఎస్ ఆఫీసర్ అమితాబ్ ఠాకూర్ ప్రకటించారు. ఆ ప్రకటన చేసిన గంటల వ్యవధిలోనే.. అత్యాచార బాధితురాలికి వ్యతిరేకంగా నిందితుడికి సాయం చేశారన్న ఆరోపణలపై అమితాబ్ ఠాకూర్ను యూపీ పోలీసులు అరెస్టు చేశారు. బీఎస్పీ ఎంపీ అతుల్రాయ్ తనపై అత్యాచారం చేశాడంటూ.. తనకు న్యాయం చేయాలని కోరుతూ.. ఈ నెల 16న 24 ఏండ్ల యువతి తన స్నేహితుడితో కలిసి సుప్రీంకోర్టు గేటు ఎదుట ఆత్మహత్యాయత్నం చేశారు. అంతకు ముందు ఆమె మాట్లాడుతూ.. ఎంపీ అతుల్ రాయ్కు సాయం చేసేలా కొంత మంది పోలీసులు వ్యవహరిస్తున్నారంటూ ఆమె ఆరోపించారు. 24వ తేదీన ఆమె ఢిల్లీలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు.
అయితే ఈ కేసులోనే అమితాబ్ ఠాకూర్ను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. అయితే అమితాబ్ ఠాకూర్ తన విధుల పట్ల నిబద్ధతతో పని చేయడం లేదని ఈ ఏడాది మార్చిలోనే కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆయనను తొలగించింది. అనంతరం తాను 2022 అసెంబ్లీ ఎన్నికల్లో యోగిపై పోటీ చేస్తానని, త్వరలోనే పార్టీని ప్రారంభించబోతున్నట్లు అమితాబ్ ఠాకూర్ ప్రకటించారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఆయన అరెస్టు యూపీలో సంచలనంగా మారింది.