అహ్మదాబాద్ : గుజరాత్లోని బహుమలి భవన్ అనే ప్రభుత్వ కార్యాలయం ఆవులకు ఆవాసంగా మారిందని చెప్పొచ్చు. ఆ భవనంలోని అన్ని అంతస్తుల్లో ఆవులు ప్రశాంతంగా తిరుగుతున్నాయి. ఒక ఆవు కారిడార్ మొత్తం తిరిగి.. విరామం తీసుకుంటున్న మరో ఆవు వద్దకు వచ్చింది. రెండు కలిసి విశ్రాంతి తీసుకుంటున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఆవుల పర్యటనపై నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు ఎలా పని చేస్తున్నారని ఆవులు తనిఖీలు చేస్తున్నాయని ఒకరు అభిప్రాయపడ్డారు. మరొకరేమో ఆవులు డాక్టర్ రౌండ్స్ వేస్తున్నాయని జోక్ వేశారు.
అయితే రోడ్లు, బహిరంగ ప్రదేశాల్లో ఆవులు తిరగడాన్ని నిషేధిస్తూ గుజరాత్ ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించింది. ఈ బిల్లును ఆవుల యజమానులు, గోశాలల నిర్వాహకులు తీవ్రంగా వ్యతిరేకించారు. దీంతో ఆ బిల్లును ఉపసంహరించుకుంటున్నట్లు ప్రభుత్వం ఇటీవలే ప్రకటించింది.
అయితే ఆ బిల్లు ప్రకారం.. రోడ్లు, బహిరంగ ప్రదేశాల్లో ఆవులు తిరిగితే తప్పకుండా దాని యజమానికి ఏడాది పాలు జైలు శిక్ష లేదా రూ. 10 వేల వరకు జరిమానా విధించనున్నారు. కొన్ని సందర్భాల్లో ఈ రెండింటిని కూడా అమలు చేయొచ్చు.