మొన్న అమ్మమ్మ సందేహంగా అడిగింది!
వీధుల్లో రాసులుగా పోసి అమ్మిన ముత్యాల ముచ్చట్లు
శతాబ్దాలు దాటినా ఒడవవెందుకని?
సహాయ నిరాకరణ, దండియాత్ర, క్విట్ ఇండియా పాఠాలు
ఇంకా ఎన్నేళ్లు చదువుకుంటారని?
చిట్టాగాంగ్, గదర్ దళం, ఆజాద్ హింద్ ఫౌజు జ్ఞాపకాలు
ఇంకెన్ని కాలాలు తలుచుకుంటారని?
స్వాతంత్య్రం అంటే సౌభాతృత్వం అనుకునే రోజులవి!
నిన్న అమ్మ ప్రేమగా చెప్పింది!
మొక్కాల్సింది క్రికెట్ దేవుళ్లను
ప్రేరణగా తీసుకోవాల్సింది సెన్సెక్స్ వీరులను
ఉద్వేగానుబంధాలు పెంచుకోవాల్సింది తెర ధీరులతో కాదని
జాతీయనేతల విగ్రహాలు కేవలం అడ్రస్ సూచికలు కాదని
ఎన్ని కత్తులు రాలినా కుటుంబ వృక్షమే మనకు పెట్టని కోటని!
స్వాతంత్య్రం అంటే సమానత్వం అనుకునే దశ అది!
తరాల్ని మోస్తూ తిరుగుతున్న భారతమ్మ
లాలనగా ఈరోజు నాతో సంభాషించింది.
నేను అడిగాను-
కన్నీళ్లు రుచి చూడని చెంపల్ని, వెక్కిళ్ళు వినపడని వంటిల్లుని
సంకెళ్లు వేయని ఆకలి పేగులని
రక్తాలు ఓడని వలస పాదాలని
ఆత్మహత్యలు కానరాని పొలాలను
మానవీయత నిండిన మేధను ప్రసాదించమని !
స్వాతంత్య్రమంటే స్వేచ్ఛ అనుకునే
తరం మనది కదా!
ఇప్పుడు అర్థమైంది-
స్వాతంత్య్రం అంటే
‘సత్యమేవ జయతే’ వాదం
‘ధర్మో రక్షతి రక్షతః’ జ్ఞానం
‘భిన్నత్వంలో ఏకత్వ’ చైతన్యం
జన గణ మన అస్తిత్వం
‘వందేమాతర’ బృందగానం!!
అయినంపూడి శ్రీలక్ష్మి
9989928562