కోల్కతా: పశ్చిమబెంగాల్లోని హౌరా రైల్వేస్టేషన్లో ఇవాళ ఉదయం వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలు ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ప్రధాని నరేంద్రమోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైలును ప్రారంభించారు. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద్ బోస్, ముఖ్యమంత్రి మమతాబెనర్జి ప్రత్యక్షంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
అయితే, ఈ సందర్భంగా కాసేపు హైడ్రామా చోటుచేసుకుంది. కార్యక్రమంలో పాల్గొనేందుకు మమతాబెనర్జి హౌరా రైల్వేస్టేషన్కు చేరుకోగానే కొందరు బీజేపీ మద్దతుదారులు జై శ్రీరామ్ అంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. చాలాసేపు నినాదాలు కొనసాగడంతో మమత అసహనం వ్యక్తంచేశారు. ప్రారంభోత్సవ వేదికపైకి వెళ్లేందుకు నిరాకరించారు.
కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్, గవర్నర్ ఆనంద్ బోస్ ఆమెను శాంతపరుస్తూ వేదిక మీదకు రావాలని పిలిచినా మమతా బెనర్జి పట్టించుకోలేదు. ముఖంలో కోపాన్ని ప్రదర్శిస్తూ జనంలోనే ఉండిపోయారు. అయితే ఆ తర్వాత కోల్కతాలో జరిగిన నేషనల్ గంగా కౌన్సిల్ సమావేశానికి మమత హాజరయ్యారు. ఈ సమావేశంలో కూడా ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు.
కాగా, అంతకుముందు మమతా బెనర్జి హౌరా రైల్వే స్టేషన్లోకి రాగానే బీజేపీ మద్దతుదారులు జై శ్రీరామ్ నినాదాలు చేసిన దృశ్యాలు, అందుకు ప్రతిగా మమత వేదికపైకి వెళ్లేందుకు నిరాకరించిన దృశ్యాలు మీడియా కెమెరాల్లో రికార్డయ్యాయి. కింది వీడియోలో ఆ దృశ్యాలను మీరు కూడా వీక్షించవచ్చు.
#WATCH | ‘Jai Shri Ram’ slogans were raised on a platform at Howrah Railway station after the arrival of West Bengal CM Mamata Banerjee at the event where Vande Bharat Express was later flagged off by PM Modi through video conferencing. pic.twitter.com/PKAWPr9zSo
— ANI (@ANI) December 30, 2022