ముంబై: దేశవ్యాప్తంగా విమానాశ్రయాల్లో భారీగా అక్రమ బంగారం (Gold) పట్టుబడుతూనే ఉన్నది. దేశంలో పసిడికి మంచి డిమాండ్ ఉండటంతో అక్రమార్కులు వివిధ మార్గాల్లో పసిడిని తరలిస్తున్నారు. అయితే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రావడంతో అధికారులు విమానాశ్రయాల్లో బంగారాన్ని పట్టుకుంటున్నారు. తాజాగా ముంబైలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో (Mumbai Airport) 3 కిలోల బంగారం పట్టుబడింది.
మార్చి 10న అడిస్ అబాబా (Addis Ababa) నుంచి ముంబై వచ్చిన విదేశీ ప్రయాణికులను (Foreign nationals) కస్టమ్స్ అధికారులు (Mumbai Customs) తనిఖీచేశారు. ఈ సందర్భంగా వారివద్ద 3 కిలోల బంగారం లభించింది. దాని విలువ రూ.1.40 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు. లోదుస్తులు (Undergarments), బూట్లలో (Footwear) తరలిస్తున్నారని వెల్లడించారు. ముగ్గురిని అరెస్టు చేశామని చెప్పారు.
Maharashtra | On 10th March, over 3 Kg of gold valued at Rs 1.40 Crore seized from three foreign nationals who had arrived from Addis Ababa to Mumbai. Gold was found to be concealed in the undergarments and insole of the footwear: Mumbai Customs pic.twitter.com/FuWZNruq0d
— ANI (@ANI) March 12, 2023
ఇక.. ఆంధ్రప్రదేశ్లోని (Andhrapradesh) శ్రీకాకుళం (Srikakulam) జిల్లా ఆమదాలవలస (Amadalavalasa) రైల్వేస్టేషన్లో అక్రమంగా తరలిస్తున్న 7.39 కిలోల బంగారం పట్టుబడింది. దీని విలువ రూ.4.21 కోట్లు ఉంటుందని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) అధికారులు తెలిపారు.
బంగారం అక్రమ రవాణా జరుగుతున్నట్టు డీఆర్ఐకి విశ్వసనీయ సమాచారం అందింది. దీంతో ఈ నెల 9న ఆమదాలవలస రైల్వేస్టేషన్లో అధికారులు తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా హౌరా-చైన్నె మెయిల్లో వచ్చిన కోల్కతాకు చెందిన ఇద్దరు వ్యక్తులను తనిఖీ చేయగా.. వారివద్ద 7.396 కిలోల బంగారు కడ్డీలు లభించాయి. బంగ్లాదేశ్ నుంచి తీసుకు వచ్చిన బంగారాన్ని.. దిమ్మెలుగా చేసి కోల్కతా నుంచి చైన్నె తరలిస్తున్నట్టు గుర్తించారు.