భోపాల్: మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో గ్యాస్ దుర్ఘటన జరిగి 37 ఏండ్లయ్యాయి. 1984 డిసెంబర్ 2-3 మధ్య రాత్రి వేళ యూనియన్ కార్బైడ్ ఇండియా లిమిటెడ్ పురుగుమందుల ప్లాంట్ నుంచి మిథైల్ ఐసోసైనేట్ విష వాయువులు లీక్ అయ్యాయి. సుమారు మూడు వేల మంది వరకు మరణించగా ఐదు లక్షలకుపైగా గాయపడ్డారు. ఎన్నో కుటుంబాలు ఎన్నో ఏండ్లగా బాధితులుగా మిగిలాయి. ప్రపంచంలోని అతి దారుణమైన పారిశ్రామిక విపత్తులలో ఒకటిగా దీనిని పరిగణించారు.
కాగా, భోపాల్ గ్యాస్ దుర్ఘటన జరిగి 37 ఏండ్లు అయిన సందర్భంగా బాధిత కుటుంబాలు శుక్రవారం భోపాల్లో భారీ నిరసన ర్యాలీ నిర్వహించాయి. యూనియన్ కార్బైడ్ సంస్థతోపాటు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బాధితులెవరికీ న్యాయం జరుగలేదని మహిళలు ఆరోపించారు. ఈ సంఘటనకు ఏ ఒక్క వ్యక్తి లేదా కార్పొరేషన్ బాధ్యత వహించలేదని కార్యకర్త రచన ధింగ్రా విమర్శించారు. ఇప్పటికైనా బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.