న్యూఢిల్లీ: విపక్షాల ఉపరాష్ట్రపతి అభ్యర్థి మార్గరెట్ అల్వా (Margaret Alva) నేడు టీఆర్ఎస్ ఎంపీలతో భేటీకానున్నారు. శుక్రవారం సాయంత్రం 5 గంటలకు ఢిల్లీలోని పార్లమెంటరీ పార్టీపక్ష నేత కే కేశవరావు ఇంట్లో పార్టీ ఎంపీలతో సమావేశమవనున్నారు. కాగా, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల అభ్యర్థి మార్గరెట్ అల్వాకు మద్దతివ్వాలని పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ నిర్ణయించిన విషయం తెలిసిందే. దీంతో శనివారం జరుగనున్న ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో టీఆర్ఎస్కు చెందిన 16 మంది ఎంపీలు ఆమెకు ఓటేయనున్నారు.
ఉపరాష్ట్రపతి ఎన్నిక పార్లమెంట్ భవనంలో శనివారం జరగనుంది. రహస్య బ్యాలెట్ విధానంలో జరుగనున్న ఈ ఎన్నికలో మొత్తం 788 మంది ఎంపీలు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. సాయంత్రం కౌంటింగ్ నిర్వహించి.. ఫలితాలు వెల్లడిస్తారు. ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా జగదీప్ ధన్ఖడ్ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.