న్యూఢిల్లీ : సీనియర్ జర్నలిస్ట్ వినోద్ దువా (67) శనివారం మరణించారు. ఢిల్లీ హాస్పిటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో కొద్దిరోజులుగా చికిత్స పొందుతున్న దువాకు ఈ ఏడాది ఆరంభంలో కొవిడ్-19 ఇన్ఫెక్షన్ సోకింది. ఆయన ఆరోగ్యపరిస్ధితి క్షీణించడంతో ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. టీవీ జర్నలిజంలో అపార అనుభవం కలిగిన దువా దూరదర్శన్, ఎన్డీటీవీల్లో దీర్ఘకాలం పనిచేశారు.
తన జర్నలిజం కెరీర్లో ఆయన పలు ఇతర టీవీ చానెళ్లు, ఆన్లైన్ పోర్టల్స్లో షోలు నిర్వహించారు. తమ తండ్రి వినోద్ దువా మరణించారని ఆయన కుమార్తె మల్లికా దువా సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఢిల్లీలోని రెఫ్యూజీ కాలనీల నుంచి అత్యున్నత పాత్రికేయ నైపుణ్యాలతో ప్రముఖ జర్నలిస్టుగా ఆయన ఎదిగారని పేర్కొన్నారు.
ఇప్పుడు ఆయన పైలోకంలో తమ అమ్మ దగ్గరికి చేరుకున్నారని చెప్పారు. కరోనా సెకండ్ వేవ్లో వినోద్ దువా, ఆయన భార్య పద్మావతి దువా వైరస్ బారినపడ్డారు. ఇద్దరూ గురుగ్రాం ఆస్పత్రిలో చేరగా దీర్ఘకాలం కొవిడ్-19తో పోరాడుతూ పద్మావతి దువా ఈ ఏడాది జూన్లో కన్నుమూశారు.