న్యూఢిల్లీ, ఆగస్టు 26: ప్రజాప్రతినిధులపై సీబీఐ నమోదు చేసిన కేసుల దర్యాప్తు, విచారణను వేగవంతం చేసేందుకు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం గురువారం పలు మార్గదర్శకాలను జారీచేసింది. పెండింగ్ కేసుల విచారణకు అవసరమైన చోట అదనపు సీబీఐ/ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయాలని హైకోర్టులకు సూచించింది. దీనికి కేంద్రం, రాష్ట్రప్రభుత్వాలు సహకరించాలని ఆదేశించింది. ఏదైనా ప్రభుత్వం సహకరించకపోతే తమకు స్టేటస్ రిపోర్టు పంపించాలని హైకోర్టులను కోరింది. సహకరించకపోతే తగిన చర్యలు తీసుకొంటామని హెచ్చరించింది. ఒక రాష్ట్రంలో కేసులు భారీగా ఉన్నప్పుడు ఒకే ఒక్క ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేయడం వల్ల ఫలితం ఉండదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. మధ్యప్రదేశ్లో ప్రత్యేక కోర్టును ఈ సందర్భంగా ప్రస్తావించింది. పెండింగ్ కేసులు, ప్రత్యేక కోర్టుల సంఖ్య మధ్య హేతుబద్ధీకరణ తీసుకురావాలని అభిప్రాయపడింది. వంద కంటే ఎక్కువ కేసులు ఉన్న రాష్ర్టాల్లో పలు చోట్ల ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయాలని, ఇందుకు ప్రభుత్వాలు మౌలిక సదుపాయాలు కల్పించాలని ఆదేశించింది. సీబీఐ పెండింగ్ కేసుల ట్రయల్స్ను హైకోర్టులు వీలైనంత త్వరగా పూర్తి చేయాలని కోరింది. సీబీఐ సమర్పించిన వివరాల ప్రకారం ప్రజాప్రతినిధులపై 223 కేసులు పెండింగ్లో ఉన్నాయి.
ప్రభుత్వం మారగానే దేశద్రోహం కేసులా?
పాలక పక్షం మారగానే గత ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేసిన అధికారులపై దేశద్రోహం కేసులు నమోదు చేయడం అందోళన కలిగించే ధోరణి అని సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. దీనికి పోలీసు శాఖ కూడా ఒక కారణమని పేర్కొంది. ఈ ధోరణి ఇప్పటికైనా మానేయాలని హితవు పలికింది. అధికారంలో ఉన్న పార్టీకి కొందరు పోలీస్ అధికారులు కొమ్ముకాస్తున్నారని, పాలకపక్షం ప్రాపకం కోసం అధికారాలను దుర్వినియోగం చేస్తున్నారని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం మండిపడింది. పోలీసులు చట్టానికి కట్టుబడే వ్యవహరించాల్సి ఉంటుందని స్పష్టంచేసింది. ఛత్తీస్గఢ్కు చెందిన గుర్జిందర్పాల్ సింగ్ అనే ఐపీఎస్ అధికారిపై నమోదైన రెండు కేసుల విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. గత బీజేపీ ప్రభుత్వంలో ఐజీగా పనిచేసి ఇటీవల సస్పెండైన గుర్జిందర్పాల్పై ఛత్తీస్గఢ్లో ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం రెండు కేసులను నమోదు చేసింది. ఇందులో ఒకటి అక్రమాస్తుల కేసు కాగా, రెండోది దేశద్రోహం కేసు. అయితే, తనపై నమోదైన కేసులను సవాల్ చేస్తూ గుర్జిందర్పాల్ కోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలోనే ధర్మాసనం పై వ్యాఖ్యలు చేసింది. పిటిషనర్ను నాలుగు వారాలపాటు అరెస్టు చేయరాదని ఛత్తీస్గఢ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. కేసుల దర్యాప్తులో అధికారులకు సహకరించాలని పిటిషనర్కు సూచించింది.