హైదరాబాద్ : దేశంలో అభివృద్ధి ఎలాంటి అడ్డంకులు లేకుండా ముందుకెళ్లేందుకు అన్ని రాష్ట్రాల శాసనసభ, పార్లమెంటు స్థానాలకు ఏకకాలంలో ఎన్నికలు జరగాల్సిన అవసరం ఉన్నదని భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. ఇందుకు అన్ని రాజకీయ పార్టీలు, సంబంధిత వర్గాల మధ్య ఏకాభిప్రాయ సాధన అత్యంత ఆవశ్యకమని ఆయన అభిప్రాయపడ్డారు. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా భారత ఎన్నికల సంఘం (ఈసీ) ఢిల్లీలో ఏర్పాటుచేసిన కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి పంపిన సందేశాన్ని చదివి వినిపించారు. కరోనా నియమనిబంధనల మేరకు వెంకయ్య నాయుడు స్వీయనిర్బంధంలో ఉన్న విషయం తెలిసిందే.
ఎన్నికల బరిలో నిలిచిన వారి యోగ్యత ఆధారంగానే వారికి ఓటేసి చట్టసభలకు పంపించాల్సిన అవసరాన్ని వెంకయ్యనాయుడు నొక్కిచెప్పారు. ఈ ప్రక్రియలో ఓటు అర్హత ఉన్న ప్రతి పౌరుడు తన బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తించాలని ఆయన సూచించారు. స్వాతంత్ర్య భారతదేశంలో ఎన్నికల సంస్కరణలు తీసుకురావడంలో, ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేయడంలో ఎన్నికల సంఘం చేస్తున్న కృషిని ఆయన ఈ సందర్భంగా అభినందించారు. అయితే ఓటర్లు స్వేచ్ఛగా ఓటింగ్లో పాల్గొనేలా చేయడంలో ఉన్న అడ్డంకులను పరిష్కరించడం, సమగ్రమైన ఎన్నికల వ్యవస్థను తీసుకురావడం ఎన్నికల సంఘం ముందున్న సవాళ్లలో ఒకటని అన్నారు.
వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కనీసం 75 శాతం ఓటింగ్ నమోదయ్యేలా చూడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని వెంకయ్యనాయుడు గుర్తు చేశారు. ఇందులో ఎన్నికల సంఘం చేస్తున్న కృషికి బాధ్యతాయుతమైన దేశ పౌరులుగా మనందరి తోడు ఉండాలన్నారు. స్వాతంత్ర భారతదేశ చరిత్రలో తొలిసారిగా 2019 సార్వత్రిక ఎన్నికల్లో మహిళల ఓటింగ్ శాతం ఎక్కువగా నమోదవడాన్ని ఉపరాష్ట్రపతి ప్రస్తావిస్తూ.. దేశంలో వస్తున్న సానుకూలమైన మార్పునకు ఇదొక సంకేతంగా అభివర్ణించారు.