న్యూఢిల్లీ : బాలీవుడ్ నటి కంగనా రనౌత్పై బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. భారతదేశానికి 2014లో స్వాతంత్ర్యం వచ్చింది.. 1947లో స్వాతంత్ర్యం రాలేదు.. అది భిక్షం అని కంగనా వ్యాఖ్యానించింది. ఓ జాతీయ స్థాయి న్యూస్ ఛానెల్లో కంగనా ఈ వ్యాఖ్యలు చేశారు. కంగనా చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
బాలీవుడ్ నటి వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ స్పందిస్తూ.. కంగనా పిచ్చితనమా..? లేక దేశద్రోహంగా భావించాలా అని ప్రశ్నించారు. ఇటీవల పద్మ శ్రీ అవార్డు అందుకున్న కంగనా.. పలు సందర్భాల్లో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షాను కొనియాడిన సంగతి తెలిసిందే.
భారత జాతిపిత మహాత్మాగాంధీ త్యాగాలను అవమానించడం సరికాదు అని వరుణ్ గాంధీ అన్నారు. గాంధీని చంపిన గాడ్సేను పొగడడం దారుణమన్నారు. ఇప్పుడేమో.. మంగళ్ పాండే, రాణి లక్ష్మీభాయి, భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, నేతాజీ సుభాష్ చంద్రబోస్తో పాటు లక్షలాది స్వాతంత్ర్య సమరయోధులను అగౌరవించడం సరికాదు అని వరుణ్ గాంధీ పేర్కొన్నారు.