Varun Gandhi: లోక్సభ ఎన్నికల్లో పోటీపడబోయే 195 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను బీజేపీ ఇప్పటికే వెల్లడించింది. మరో వంద లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయకుండా పెండింగ్లో పెట్టింది. అత్యధిక లోక్సభ స్థానాలున్న ఉత్తరప్రదేశ్లో కూడా బీజేపీ మరో 29 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. యూపీలో కీలక నేతలైన వరుణ్గాంధీ, మేనకాగాంధీ పేర్లను కూడా తొలి జాబితాలో ప్రకటించకపోవడం అనుమానాలకు తావిస్తోంది.
తల్లీకొడుకులకు ఈసారి లోక్సభ టికెట్లు దక్కుతాయా.. లేదా..? అని రాజకీయ విశ్లేషకులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. వరుణ్గాంధీ ప్రభుత్వంపై నిరసన గళం వినిపించడంతో ఈసారి తల్లీకొడుకులకు టికెట్లు ఇవ్వొద్దని బీజేపీ అధిష్ఠానం భావిస్తోందేమోనని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ప్రస్తుతం యూపీలో పిలిభిత్ నియోజకవర్గం నుంచి వరుణ్గాంధీ లోక్సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
వరుణ్గాంధీ తల్లి, కేంద్ర మాజీ మంత్రి మేనకాగాంధీ సుల్తాన్పూర్ లోక్సభ స్థానం నుంచి సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. ఈ ఇద్దరికీ ఈసారి సీట్లు దక్కేది అనుమానంగా ఉంది. ఎందుకంటే వరుణ్గాంధీ గతంలో రైతులకు సంబంధించిన సమస్యలపై పార్టీ హైకమాండ్ను, యూపీ సర్కారును తప్పుపట్టారు. వ్యతిరేక గళం వినిపించారు. అందుకే ఈసారి ఆయన తల్లి మేనకా గాంధీకి మంత్రి పదవి కూడా ఇవ్వలేదు.
ఈ నేపథ్యంలో ఇప్పుడు వారికి పార్టీ టికెట్లు ఇవ్వడంపై అనుమానాలు ముసురుకున్నాయి. దాంతో బీజేపీ టికెట్ ఇవ్వకపోతే ఈసారి వరుణ్గాంధీ ప్రతిపక్ష ఇండియా కూటమి మద్దతుతో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగుతారని వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో తన తండ్రి సంజయ్గాంధీ ప్రాతినిధ్యం వహించిన అమేథీ లోక్సభ స్థానం నుంచి వరుణ్గాంధీ పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది.