న్యూఢిల్లీ, మార్చి 26: గాంధీ – నెహ్రూ కుటుంబ వారసుడు, బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ రాజకీయ భవిష్యత్తు గందరగోళంలో పడింది. సిట్టింగ్ ఎంపీ అయినప్పటికీ వరుణ్ గాంధీకి బీజేపీ టికెట్ ఇవ్వలేదు. దీంతో ఆయన ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తారని, సమాజ్వాదీ పార్టీలో చేరతారని రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి.
వరుణ్ గాంధీ కాంగ్రెస్లో చేరాలని ఆ పార్టీ లోక్సభాపక్ష నేత అధిర్ రంజన్ చౌదరి ఆహ్వానం పలకడంతో వరుణ్ గాంధీ అడుగులు ఎటువైపు ఉంటాయనేది ఆసక్తికరంగా మారింది. సంజయ్ గాంధీ కుమారుడైన వరుణ్ గాంధీ మూడుసార్లు ఎంపీగా గెలిచి హ్యాట్రిక్ సాధించారు. అయితే, ఇటీవలి కాలంలో ఆయన యూపీలోని యోగి సర్కార్తో పాటు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై వివిధ అంశాల్లో విమర్శలు గుప్పించారు. దీంతో బీజేపీ పెద్దలు ఆయనకు టికెట్ ఇవ్వలేదు.
తనకు టికెట్ ఇవ్వకుండా బీజేపీ మోసం చేసిందనే భావనతో వరుణ్ గాంధీ ఉన్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఆయనను పార్టీలోకి రమ్మని ఆహ్వానించింది. వరుణ్ది గాంధీ కుటుంబం కావడం వల్లనే బీజేపీ టికెట్ ఇవ్వలేదని కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరి ఆరోపించారు.
ఆయన కాంగ్రెస్లో చేరితే ఆహ్వానిస్తామని, తామంతా సంతోషిస్తామని వ్యాఖ్యానించారు. కాగా, గతంలో వరుణ్ గాంధీని కాంగ్రెస్లోకి తీసుకునే విషయమై రాహుల్ గాంధీ భిన్నంగా స్పందించారు. వరుణ్ గాంధీని తాను కలుస్తానని, ఆలింగనం చేసుకుంటానని, అయితే ఆయన భావజాలాన్ని మాత్రం తాను అంగీకరించనని రాహుల్ స్పష్టం చేశారు.