Gyanvapi Mosque | వారణాసి, జనవరి 31: ఉత్తరప్రదేశ్లోని జ్ఞానవాపి మసీదు వివాదంలో బుధవారం కీలక పరిణామం చోటుచేసుకొన్నది. మసీదు బేస్మెంట్లోని వ్యాస్ టిఖానా వద్ద ఉన్న హిందూ దేవతల విగ్రహాలకు పూజలు చేసుకొనేందుకు వారణాసి జిల్లా కోర్టు అనుమతి ఇచ్చింది. వారంలోగా పూజలు చేసుకొనేందుకు ఏర్పాట్లు చేయాలని జిల్లా యంత్రాంగాన్ని న్యాయమూర్తి ఏకే విశ్వాస్ ఆదేశించారు. ‘జ్ఞానవాపి మసీదులో పూజలు నిర్వహించకుండా అడ్డుకొనేందుకు ఏ కారణమూ కనిపించటంలేదు. ఇకనుంచి ఇక్కడ కాశీ విశ్వనాథ్ ఆలయ ట్రస్టు పూజలు నిర్వహిస్తుంది. ఈ పరిణామంపై మేం గర్వపడుతున్నాం. ఇది మొదటి అడుగు మాత్రమే. ఈ తీర్పును ఎవరైనా సవాల్ చేస్తే సమాధానం ఇచ్చేందుకు మేం సిద్ధంగా ఉన్నాం’ అని హిందూ పిటిషనర్ల తరఫు న్యాయవాది మదన్మోహన్ యాదవ్ తెలిపారు. మసీదు కాంప్లెక్స్లో రెండుమూడు రోజుల్లో పూజలు మొదలుపెడుతామని కాశీ విశ్వనాథ్ ఆలయ చైర్పర్సన్ నాగేంద్ర పాండే చెప్పారు. ఇకపై అక్కడ రోజూ పూజలు నిర్వహిస్తామని వెల్లడించారు. పూజలు నిర్వహించే ప్రాంతాన్ని పరిరక్షించేందుకు అక్కడ ఒక తలుపు ఏర్పాటుచేస్తామని పేర్కొన్నారు. సంపూర్ణమైన జ్ఞానవాపి ఆలయంలో పూజలు నిర్వహించాలని ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నామని అన్నారు.
మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ ఆలయాన్ని ధ్వంసం చేసి మసీదు నిర్వహించాడని ప్రచారంలో ఉన్న జ్ఞానవాపి మసీదులో 1993 వరకు పూజలు నిర్వహించినట్టు పిటిషనర్ శైలేంద్రకుమార్ పాఠక్ తన పిటిషన్లో పేర్కొన్నారు. తన తాత సోమ్నాథ్ వ్యాస్ ఆ మసీదులోని హిందూ విగ్రహాలకు పూజలు నిర్వహించేవారని, 1993లో ములాయంసింగ్ యాదవ్ ప్రభుత్వ హయాంలో పూజలను నిలిపివేయించారని తెలిపారు. మళ్లీ అక్కడ పూజలు నిర్వహించుకొనేందుకు అవకాశం కల్పించాలని పిటిషన్లో కోర్టును కోరారు. మసీదులోని వజూఖానా ముందు ఉన్న నంది విగ్రహం వద్ద గతంలో ఏర్పాటుచేసిన బారికేడ్స్ను తొలగించాలని అభ్యర్థించారు. ‘మసీదులోని విగ్రహాలకు శతాబ్దాలపాటు పూజలు కొనసాగాయి. 1993లో ములాయంసింగ్ ప్రభుత్వం విగ్రహాలకు అడ్డుగా బారికేడ్స్, ఇనుపకంచెను ఏర్పాటుచేసి హిందువులు పూజలు చేసుకోకుండా అడ్డుకొన్నది. ఇప్పుడు మళ్లీ పూజలు పునఃప్రారంభం కాబోతున్నాయి’ అని పిటిషనర్ తరఫు న్యాయవాది తెలిపారు. 400 ఏండ్ల తమ తపస్సు ఫలించిందని పూజారి సోమ్నాథ్ వ్యాస్ మరో వారసుడు అశుతోష్ వ్యాస్ సంతోషం వ్యక్తంచేశారు.
జిల్లా కోర్టు తీర్పుపై జ్ఞానవాపి మసీదు బాధ్యతలు చూస్తున్న అంజుమన్ ఇంతెజామియా మస్జిద్ కమిటీ తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేసింది. సెల్లార్ ప్రాంతం కూడా మసీదు కాంప్లెక్స్లో భాగమని, ఇక్కడ పూజలు చేయడానికి అనుమతి ఇవ్వరాదని వాదించింది. జిల్లా కోర్టు తీర్పును అలహాబాద్ హైకోర్టులో సవాల్ చేస్తామని ప్రకటించింది. అయితే, అంతకుముందే హైకోర్టులో కేవియట్ పిటిషన్ వేయనున్నట్టు హిందూ పిటిషనర్ తరఫు న్యాయవాది జైన్ తెలిపారు.
జ్ఞానవాపి మసీదు సముదాయంలో ఉన్న వజూఖానా (కాళ్లు, చేతులు కడుక్కొనే స్థలం)లో భారత పురాతత్వ అధ్యయనాల సంస్థ (ఏఎస్ఐ) చేత సర్వే జరిపించాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై అలహాబాద్ హైకోర్టు స్పందించింది. అంజుమన్ ఇంతెజామియా మసీదు కమిటీకి బుధవారం నోటీసు ఇచ్చింది. ఇక్కడ సర్వే చేయించడానికి వారణాసి కోర్టు తిరస్కరించడంతో హిందూ భక్తురాలు రాఖీసింగ్ ఈ పిటిషన్ను దాఖలు చేసింది. వజూఖానా ప్రాంతంలో సర్వే చేయడం చాలా ముఖ్యమని పిటిషన్లో పేర్కొన్నారు. సర్వే చేస్తే దీని మతపరమైన లక్షణం ఏమిటో వెల్లడవుతుందని కోర్టుకు తెలిపారు. రాఖీసింగ్ పిటిషన్ను వారణాసి జిల్లా కోర్టు 2023 అక్టోబరు 21న తిరస్కరించింది. ‘శివలింగం’ ఉన్నదని చెప్తున్న ప్రాంతాన్ని పరిరక్షించాలని సుప్రీంకోర్టు 2022 మే 17న తీర్పు చెప్పినందువల్ల ఇప్పుడు అదే ప్రదేశంలో సర్వేకు అనుమతించలేమని జిల్లా కోర్టు తెలిపింది. ఈ జిల్లా కోర్టు గత ఏడాది జూలై 21న ఏఎస్ఐకి ఇచ్చిన ఆదేశాల్లో వజూఖానా మినహా మిగిలిన మసీదు ప్రాంగణంలో సవివరమైన సైంటిఫిక్ సర్వే చేయాలని తెలిపింది. దేవాలయంపైన మసీదును నిర్మించారా? అనే విషయాన్ని తెలుసుకునేందుకు అవసరమైన చోట తవ్వకాలు కూడా జరిపేందుకు అనుమతి ఇచ్చింది.