Mob attack : ఉత్తరప్రదేశ్ (Uttarpradesh) లోని వారణాసిలో ఒక సాధారణ రోడ్డు ప్రమాదం హింసాత్మకంగా మారింది. ఒక వ్యాపారి ప్రాణాలను బలితీసుకున్నది. కారుతో ఒక మహిళను ఢీకొట్టాడన్న ఆగ్రహంతో స్థానికులు మూకదాడికి పాల్పడి 38 ఏళ్ల వ్యాపారిని కొట్టి చంపారు. ఈ అమానుష ఘటన ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. మనీశ్ కుమార్ సింగ్ (Manish Kumar Singh) అనే వ్యాపారి ఆదివారం రాత్రి 11 గంటల సమయంలో కారులో ఇంటికి తిరిగి వస్తున్నారు. ఈ క్రమంలో ఆయన కారు రోడ్డు పక్కన నడుస్తున్న ఒక మహిళను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో గాయపడిన మహిళను స్థానికులు వెంటనే చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
అయితే ప్రమాదం జరిగిన తర్వాత అక్కడి పరిస్థితి అదుపుతప్పింది. ఆగ్రహంతో ఊగిపోయిన స్థానికులు మనీశ్ కుమార్ను కారులో నుంచి బయటకు లాగి అత్యంత కిరాతకంగా దాడిచేశారు. తీవ్ర గాయాలపాలైన అతడిని బెనారస్ హిందూ యూనివర్సిటీ ఆసుపత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ మరణించాడు. ఈ ఘటనపై గోమతి జోన్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (డీసీపీ) నీతూ కడ్యాన్ మాట్లాడుతూ.. ‘ఆదివారం రాత్రి ఫ్యాక్టరీ నుంచి ఇంటికి వస్తుండగా మనీశ్ సింగ్ కారు ఒక మహిళను ఢీకొట్టింది. ఈ ఘటన తర్వాత పరిస్థితి ఉద్రిక్తంగా మారి, స్థానికుల దాడిలో మరణించాడు’ అని చెప్పారు.
మృతుడి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు ఫూల్పూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. ఈ కేసులో 8 మంది పేర్లను చేర్చగా మరో ఏడుగురిని గుర్తుతెలియని వ్యక్తులుగా పేర్కొన్నారు. పోలీసులు ఇప్పటివరకు నలుగురు నిందితులను అరెస్ట్ చేశారని, మిగిలిన వారి కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టినట్లు డీసీపీ తెలిపారు. ఈ ఘటనతో బాధితుడి కుటుంబసభ్యులు నిరసనకు దిగారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా మనీష్ నివాసం వద్ద, ఆ ప్రాంతంలో భారీగా పోలీసులను మోహరించారు.