వారణాసి : వారణాసి గంగానదిలో పడవ ప్రమాదాల నివారణకు అధికారులు కఠిన చర్యలు చేపట్టారు. నదిలో తెడ్డుతో నడిచే పడవలపై నిషేధం విధించారు. కేవలం మోటార్ బోట్ ఆపరేషన్లకు మాత్రమే అనుమతి ఇచ్చారు. అలాగే గంగా హారతి కార్యక్రమం సమయంలో, సూర్యాస్తమయం తర్వాత బోటింగ్పై పూర్తిగా నిషేధం విధించారు. అదే సమయంలో కెపాసిటీకి మించి ఎక్కువ మందిని కూర్చోబెట్టుకుంటే బోటును సీజ్ చేసి, జరిమానా విధించనున్నట్లు ఎండీఎం సంజయ్ కుమార్ తెలిపారు.
ఈ మేరకు జిల్లా మేజిస్ట్రేట్ కౌశల్ రాజ్శర్మ మార్గదర్శకాలు జారీ చేశారు. పాత బోట్లు వేగంగా నడపొద్దని, చిన్నబోట్లను నడపొద్దని, మత్తులో ఉన్న వ్యక్తులను పడవల్లోకి ఎక్కించొద్దని స్పష్టం చేశారు. అలాగే పడవలో లైవ్ జాకెట్లు, టార్చ్లు, తాళ్లు, గాలి నింపిన ట్యూబ్లు అవసరమైన వస్తువులు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. పడవలో డైవర్ల మొబైల్ నంబర్లతో పాటు ఎన్డీఆర్ఎఫ్, డిజాస్టర్ స్పెషలిస్ట్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ల ఫోన్ నంబర్లను అందుబాటులో ఉంచాలని స్పష్టం చేశారు.