న్యూఢిల్లీ: కేంద్రంలోని నరేంద్రమోదీ సర్కారు ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన వందే భారత్ రైళ్లు వరుసగా మూడు రోజుల నుంచి వార్తల్లో నిలుస్తున్నాయి. గురవారం ఒక రైలు బర్రెలను ఢీకొట్టగా, శుక్రవారం అదే మార్గంలో మరో రైలు ఆవును ఢీకొట్టింది. ఇవాళ వేరే మార్గంలో మరో రైలుకు సంబంధించిన బేరింగులు జామ్ కావడంతో టైర్లు బిగిసిపోయాయి. దాంతో రైలు ఆగిపోయింది.
అనంతరం ఆ రైల్లోని ప్రయాణికులను శతాబ్ధి ఎక్స్ప్రెస్ రైలులో ఎక్కించి పంపించారు. ది వారణాసి వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు సీ8 బోగీకి సంబంధించిన బేరింగులలో లోపంవల్ల ఆగిపోయిందని రైల్వే అధికారులు తెలిపారు. ఉత్తరమధ్య రైల్వే పరిధిలో డన్కౌర్-వెయిర్ స్టేషన్ల మధ్య ఈ ఘటన జరిగిందని వెల్లడించారు. కాగా, సమగ్ర విచారణకు ఆదేశించినట్లు రైల్వే శాఖ తెలిపింది.
కాగా, గురువారం బర్రెలను ఢీకొట్టిన ఘటన, శుక్రవారం ఆవును ఢీకొట్టిన ఘటన గాంధీనగర్-ముంబై మార్గంలో చోటుచేసుకోగా.. శనివారం టైర్లలో బేరింగ్లు జామైన ఘటన న్యూఢిల్లీ-వారణాసి మార్గంలో చోటుచేసుకుంది. దాంతో గురువారం నుంచి వరుసగా మూడు రోజులు వందే భారత్ రైలు వార్తల్లో ఉంటున్నది.