గాంధీనగర్: గుజరాత్లోని వడోదర పాలక మండలి కీలక నిర్ణయం తీసుకున్నది. మాంసాహారాన్ని బహిరంగంగా విక్రయించే వీధి వ్యాపారులకు జరిమానా విధించనున్నది. నాన్ వెజ్ ఫుడ్ కనిపించేలా ఉండే ఫుడ్ స్టాల్స్కు అనుమతి నిరాకరించనున్నది. ఈ నేపథ్యంలో ఫుడ్ స్టాల్స్లో మాంసాహార ఆహారాన్ని ‘కనిపించేలా’ విక్రయించకుండా చూసుకోవాలని వీధి వ్యాపారులను వడోదర అధికారులు ఆదేశించారు. అటువంటి స్టాల్స్, బండ్లపై మాంసాహారాన్ని కప్పి ఉంచాలని సూచించారు. కోడి గుడ్లతో తయారు చేసిన ఆహార పదార్థాలను విక్రయించే వారికి కూడా ఇది వర్తిస్తుందని పేర్కొన్నారు.
గుజరాత్లోని మరో నగరమైన రాజ్కోట్లో మాంసాహారాన్ని విక్రయించే స్టాల్స్ను హాకింగ్ జోన్లకే పరిమితం చేయాలని నిర్ణయించారు. నాన్ వెజ్ స్టాల్స్, బండ్లను ప్రధాన రహదారులకు దూరంగా ఉంచాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో వడోదరలో కూడా అధికారులు ఇలాంటి చర్యలు చేపట్టారు.
‘నాన్ వెజిటేరియన్ ఫుడ్ ఏదీ కనిపించకుండా చూసుకోవాలి. ఇది మన మతపరమైన భావాలకు సంబంధించినది. మాంసాహారాన్ని కనిపించేలా విక్రయించే ఆచారం చాలా ఏండ్లుగా కొనసాగుతున్నది. కానీ సరిదిద్దాల్సిన సమయం ఆసన్నమైంది’ అని వడోదర మున్సిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ చైర్ పర్సన్ హితేంద్ర పటేల్ వ్యాఖ్యానించారు.