జైపూర్: కరోనా మహమ్మారిని కట్టడి చేసే టీకాపై గిరిజనుల్లో అనేక భయాందోళనలు నెలకొన్నాయి. దీంతో మీడియా సిబ్బందిని చూసి టీకా వేసేందుకు వస్తున్నారని భావించి ఇండ్ల నుంచి పారిపోయారు. రాజస్థాన్లోని జలవర్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. నారాయణఖేడ ప్రాంతంలోని గిరిజనుల్లో కరోనా టీకాపై అనేక అపోహాలున్నాయి. కలాకోట్, బిర్యఖేడి గ్రామాలకు చెందిన కంజర్ కమ్యూనిటీ ప్రజలు వ్యాక్సిన్ తీసుకునేందుకు ముందుకు రావడం లేదు.
కరోనా టీకా తీసుకున్న తర్వాత ఆ వర్గానికి చెందిన ఇద్దరు చనిపోవడంతో వారిలో భయం పట్టుకున్నది. వ్యాక్సిన్ వేయించుకుంటే చనిపోతామని, లేదా నపుంసకులుగా మారతామని వారు బలంగా నమ్ముతున్నారు. దీంతో తాము టీకా తీసుకోమని గట్టిగా చెబుతున్నారు. ప్రభుత్వం తమకు రేషన్ నిలిపివేసినా సరే వ్యాక్సిన్ వేయించుకోమని అంటున్నారు. తమ వర్గం ప్రజలు మాంసం తిని మద్యం సేవిస్తారని, దీంతో తమకు కరోనా రాదని చెబుతున్నారు.
మరోవైపు కరోనా టీకాపై గ్రామ ప్రజల ప్రతిస్పందన తెలుసుకునేందుకు కొంతమంది మీడియా ప్రతినిధులు ఇటీవల గ్రామానికి వెళ్లారు. అయితే తమకు టీకా వేసేందుకు సిబ్బంది వస్తున్నారని భావించిన చాలా మంది గిరిజనులు తమ రోజువారీ పనులను వదిలి ఇండ్ల నుంచి పరుగులుతీశారు.
కాగా, ఈ విషయం తెలుసుకున్న ప్రభుత్వ అధికారులు గిరిజనుల్లో టీకాపై అవగాహన కల్పించే చర్యలు చేపట్టారు. అంగన్వాడీలు, సామాజిక కార్యకర్తలను ఆయా గ్రామాలకు పంపుతున్నారు. టీకా తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలను వారికి వివరిస్తున్నారు.