న్యూఢిల్లీ : జికా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తూనే ఉన్నది. ఇప్పటిదాకా దీనికి ఎలాంటి మందులూ, వ్యాక్సిన్లూ లేవు. నివారణ ఒక్కటే మార్గం. ఏడిస్ జాతి దోమల ద్వారా జికా వైరస్ వ్యాపిస్తుంది. యుగాండాలోని జికా అనే అడవి పేరు ఈ వైరస్కు పెట్టారు. మొట్టమొదటగా 1947లో యుగాండాలోని ఆ అడవిలోని కోతుల్లోనే ఈ వైరస్ను గుర్తించారు. 1952లో తొలిసారిగా మనుషుల్లోనూ గుర్తించారు. వైరస్ సోకితే జ్వరం, కీళ్ల నొప్పులు, తలనొప్పి, కళ్లు చర్మం ఎర్రబారడం లక్షణాలు కనిపిస్తాయి. అయితే, వైరస్ను కట్టడి చేసేందుకు దేశంలో వ్యాక్సిన్ తయారీకి శాస్త్రవేత్తలు సన్నాహాలు ప్రారంభించారు. నోయిడాలో జరిగిన ఓ వర్క్షాప్లో కొవిడ్పై నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ చైర్మన్ డాక్టర్ ఎన్కె అరోరా ఈ విషయాన్ని ప్రకటించారు.
దేశంలోని పలుచోట్ల జికా వైరస్ కేసులు నమోదయ్యాయని డాక్టర్ ఆరోరా తెలిపారు. దీంతో ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. ఈ వైరస్ కొవిడ్ మహమ్మారి అంత ప్రమాదం కానప్పటికీ దేశంలో పలు సందర్భాల్లో కేసులు నమోదవుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే వైరస్కు అడ్డుకట్ట వేసేందుకు అన్నిస్థాయిల్లో నిపుణులు సన్నాహాలు చేస్తున్నారు. దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో జికా వైరస్ కేసులు రికార్డయ్యాయి. కొత్త కొత్త వైరస్లతో జనం బెంబేలెత్తుతుండగా.. ప్రస్తుతం జికా నుంచి జనాన్ని రక్షించేందుకు వ్యాక్సిన్ను అభివృద్ధి చేస్తున్నట్లు డాక్టర్ అరోరా చేసిన ప్రకటన ఊరట కల్పిస్తున్నది.
జికా వైరస్ ఇతర వ్యక్తులతో పోలిస్తే గర్భిణులు, పిల్లల్లోనే ప్రమాదకరమని డాక్టర్ అరోరా తెలిపారు. ఎందుకంటే గర్భధారణ సమయంలో వైరస్ సోకితే.. అది శిశువుపై దుష్ప్రభావాలను కలిగిస్తుంది. శిశువు తల సాధారణం కంటే పెద్దదిగా.. లేదంటే చిన్నదిగా ఉండొచ్చు. దీంతో పాటు పిల్లల ఎత్తు కూడా ప్రభావితమయ్యే అవకాశం ఉంటుంది. ఈ సందర్భంగా డాక్టర్ అరోరా వర్క్షాప్లో కొవిడ్ వ్యాక్సినేషన్కు సంబంధించిన విషయాలను వెల్లడించారు. వర్క్షాప్లో పాల్గొన్న విద్యార్థులు, ఇతర మీడియా ప్రతినిధుల ప్రశ్నలకు ఆయన స్పందిస్తూ.. వ్యాక్సినేషన్కు సంబంధించి దేశంలో ప్రతి స్థాయిలో విస్తృతంగా కృషి చేస్తున్నట్లు తెలిపారు. 100శాతం లక్ష్యం చేరేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. గత నెల ఒకటి నుంచి ఇంటింటికీ టీకాల పంపిణీని ప్రారంభించినట్లు చెప్పారు.