ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ జాతినుద్దేశించి ప్రసంగించారు. ఈసందర్భంగా 18 ఏళ్ల లోపు వారికి వ్యాక్సినేషన్ గురించి ప్రధాని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే 18 ఏళ్లు నిండిన వాళ్లందరికీ దేశవ్యాప్తంగా వ్యాక్సిన్ను అందిస్తున్న విషయం తెలిసిందే.
జనవరి 3, 2022 నుంచి 15 నుంచి 18 ఏళ్ల వయసు ఉన్న వాళ్లకు డీఎన్ఏ వ్యాక్సిన్ను ఇవ్వడం ప్రారంభిస్తామని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. ఇప్పటి వరకు 141 కోట్ల డోస్లను దేశవ్యాప్తంగా ప్రజలకు అందించినట్టు మోదీ తెలిపారు.
ఇప్పటి వరకు ఫస్ట్ డోస్ వ్యాక్సిన్ను 90 శాతం కంటే ఎక్కువ మందికి అందించాం. 60 ఏళ్లు పైబడి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవాళ్లు డాక్టర్ల సూచనతో జనవరి 10, 2022 నుంచి ప్రికాషన్ డోస్ తీసుకోవచ్చని మోదీ తెలిపారు.
ఒమిక్రాన్ వ్యాప్తి చెందకుండా కట్టడి చేసేందుకు భారత్ సంసిద్ధంగా ఉందన్న ప్రధాని మోదీ.. భారత్లో 18 లక్షల ఐసోలేషన్ బెడ్స్ ఉన్నాయన్నారు. 5 లక్షల ఆక్సిజన్ బెడ్స్, 1.40 లక్షల ఐసీయూ బెడ్స్, 90,000 పీడియాట్రిక్ ఐసీయూ, నాన్ ఐసీయూ బెడ్స్, 3000 పీఎస్ఏ ఆక్సిజన్ ప్లాంట్స్, 4 లక్షల ఆక్సిజన్ సిలిండర్స్ను దేశ వ్యాప్తంగా డిస్ట్రిబ్యూట్ చేసినట్టు మోదీ తెలిపారు.
మహమ్మారిని అడ్డుకునేందుకు రాత్రింబవళ్లు ముందుండి పని చేస్తున్న హెల్త్ వర్కర్లకు బూస్టర్ డోస్ను అందిస్తామని మోదీ స్పష్టం చేశారు. జనవరి 10, 2022 నుంచి హెల్త్ వర్కర్లకు బూస్టర్ డోస్ ఇస్తామని ప్రకటించారు.
ప్రపంచవ్యాప్తంగా కొత్త వేరియంట్ కేసులు పెరుగుతున్నప్పటికీ.. దేశ ప్రజలు ఎవ్వరూ భయపడవద్దని.. అందరూ అప్రమత్తంగా ఉండాలని ప్రధాని మోదీ కోరారు. కరోనా ఇంకా పూర్తిగా మటుమాయం కాలేదని.. అందుకే.. అందరూ మాస్క్లను విధిగా ధరించాలని.. తరుచూ చేతులను శానిటైజ్ చేసుకోవాలని కోరారు.